ఈ ఆర్థిక సంవత్సరం (2026-27) మొదలు (ఈ ఏడాది ఏప్రిల్ 1) ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ (టీడీఎస్), ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ (టీసీఎస్) నిబంధనల్లో కొత్త మార్పులు వచ్చాయి. పన్ను ప్రక్రియల క్రమబద్ధీకరణ, తప్పులు-లోపాలను సరిదిద్దడమే లక్ష్యంగా ఈ సవరణల్ని చేశారు. టీసీఎస్ రేట్ల తగ్గింపు, ఎన్నారైల కోసం సరళతర ఆస్తి లావాదేవీలు, ట్యాక్స్పేయర్స్ పేపర్ వర్క్ను కుదించడానికి యూనిఫైడ్ టీడీఎస్ డిక్లరేషన్ ఫారం పరిచయమయ్యాయి. విదేశీ రెమిటెన్స్లు, ఆస్తి లావాదేవీలు, పెట్టుబడి ఆదాయం సహా అనేక రకాల ఆర్థిక లావాదేవీలను ఈ సంస్కరణలు ప్రభావితం చేయనున్నాయి. మరి పన్ను చెల్లింపుదారులు, ముఖ్యంగా ఎన్నారైలు, మదుపర్లు, విదేశాల్లో చదువుకొనే భారతీయ విద్యార్థులు, విదేశీ పర్యటనలకు వెళ్లేవారు తెలుసుకోవాల్సిందే ఏమిటో చూద్దాం..
ఏప్రిల్ 1 నుంచి విదేశీ పర్యటన ప్యాకేజీలపై టీసీఎస్ 2 శాతంగానే ఉంటుంది. ఇంతకుముందు రూ.10 లక్షల వరకున్న ప్యాకేజీలపై 5 శాతం, ఆపై 20 శాతంగా పన్ను నిర్మాణం ఉండేది. అలాగే విద్య, వైద్య విదేశీ రెమిటెన్స్లపై టీసీఎస్ రేటు 5 శాతం నుంచి 2 శాతానికి దిగింది. మునుపు రూ.10 లక్షలకుపైగా ఉంటే 5 శాతం టీసీఎస్ వర్తించేది. ఈ మార్పుల్ని ఈ ఏడాది కేంద్ర బడ్జెట్లో ప్రకటించారు.
ప్రవాస భారతీయుల (ఎన్నారైలు) నుంచి ఆస్తి కొనుగోలు చేసే భారతీయులకూ ఊరట దక్కనున్నది. ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి కొనుగోలుదారులకు ట్యాక్స్ డిడక్షన్ అకౌంట్ నెంబర్ (ట్యాన్)తో అవసరం లేదు. టీడీఎస్కు కొనుగోలుదారుల పర్మనెంట్ అకౌంట్ నెంబర్ (పాన్) చాలు. దీంతో ఎన్నారైలకు చెందిన ఆస్తుల కొనుగోలు లావాదేవీలు మరింత సులువుగా, వేగంగా జరుగడానికి మార్గం సుగమం కానున్నది.
రిటైల్ ఇన్వెస్టర్ల కోసం సింగిల్ టీడీఎస్ నాన్-డిడక్షన్ డిక్లరేషన్ ఫారం పరిచయమైంది. దీంతో ఇక పేపర్ వర్క్ బాగా తగ్గడమేగాక, సమయం ఆదా అవుతుందన్న అంచనాలున్నాయి. 15జీ, 15హెచ్ ఫారాల స్థానంలో ఒకే ఒక యూనిఫైడ్ ఫారం 121ను తెచ్చారు. పన్నుసహిత ఆదాయం తక్కువగా ఉన్న వ్యక్తులు, వృద్ధులు.. అనవసరమైన టీడీఎస్ డిడక్షన్ల నుంచి తప్పించుకోవడానికి ఈ 15జీ, 15హెచ్ ఫారాలను వినియోగించేవారు. ఇప్పుడు ఫారం 121తో ఆ రెండింటి పనీ తీరిపోతుంది.