న్యూఢిల్లీ : షియామి ఇండియాకు చెందిన బ్యాంకు ఖాతాల్లో రూ 5551 కోట్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సీజ్ చేసిన నేపధ్యంలో గడ్డు పరిస్ధితులు ఎదుర్కొంటున్న కంపెనీ కీలక వ్యాఖ్యలు చేసింది. షియామి భారత్ నుంచి పాకిస్తాన్కు తరలివెళుతుందని ఓ ట్విట్టర్ రిపోర్ట్ పేర్కొనడంతో అవి వదంతులేనని కంపెనీ తోసిపుచ్చింది. ఈడీ చర్యలను వ్యతిరేకిస్తూ న్యాయస్ధానాన్ని ఆశ్రయించామని తెలిపింది.
షియామి తన కార్యకలాపాలను భారత్ వెలుపలికి తరలించాలని యోచిస్తోందని, పాకిస్తాన్కు తన ఆపరేషన్స్ను మళ్లించవచ్చని సౌత్ ఆసియా ఇండెక్స్ ట్వీట్ చేసింది. అయితే ఈ కధనాలు అవాస్తవాలని, నిరాధార వ్యాఖ్యలని షియామి కొట్టిపారేసింది. 2014 జులైలో షియామి భారత్లోకి ప్రవేశించిందని, ఏడాదిలోపే 2015 జనవరిలో మేకిన్ ఇండియా ప్రస్ధానాన్ని ప్రారంభించిందని గుర్తు చేసింది. ఇప్పుడు 99 శాతం స్మార్ట్ఫోన్లు, నూరు శాతం స్మార్ట్టీవీలు భారత్లో తయారవుతున్నాయని పేర్కొంది.
అంతర్జాతీయ విశ్వసనీయ కంపెనీగా తప్పుడు కధనాల నుంచి తమ ప్రతిష్టను కాపాడుకుంటామని షియామి తెలిపింది. ఈడీ చర్యలతో తమకు కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయని, రూ 5551 కోట్ల పెద్ద మొత్తం ఫ్రీజ్ చేయడంతో షియామి భారత్ కార్యకలాపాలపై ప్రభావం చూపుతుందని పేర్కొంది. ఈడీ చర్యలకు వ్యతిరేకంగా తాము న్యాయస్ధానాన్ని ఆశ్రయించామని, అయితే ఈ విషయంలో ఇంకా తమకు కోర్టు నుంచి ఊరట లభించలేదని పేర్కొంది.