హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 2(నమస్తే తెలంగాణ): బ్యాంకులను మోసం చేసిన కేసులో కార్వీ స్టాక్ బ్రోకరింగ్ చీఫ్ అపరేటింగ్ ఆఫీసర్(సీఈవో) రాజీవ్ రంజన్సింగ్, చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్(సీఎఫ్వో) జీ కృష్ణ హరిలను గురువారం సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు నిబంధనలకు విరుద్ధంగా పలు కంపెనీలకు బదిలీ చేసినట్లు విచారణలో వెల్లడికావడంతో కార్వీ సీఈవో, సీఎఫ్వోలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇండస్ ఇండ్ బ్యాంక్ను రూ.137 కోట్లు మోసం చేసిన కేసులో కంపెనీ చైర్మన్ పార్థసారధిని గత నెలలోనే అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే కార్వీ సంస్థ మార్కెట్ షేర్ విలువను పెంచుకునేందుకు చేసిన ప్రయత్నంలో భాగంగా సంస్థకు రూ. 300 కోట్ల నష్టం వచ్చినట్లు రికార్డులలో రాసుకున్నారు. ఇలా బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు ఎగ్గొట్టడంతో, నిబంధనలకు విరుద్దంగా ఇతర కంపెనీలలోకి ఉద్దేశ్యపూర్వకంగా నిధులు మళ్లించినట్లు దర్యాప్తులో వెల్లడయ్యింది.