అమ్మకానికి 29.58% వాటా
ఆమోదం తెలిపిన సీసీఈఏ
ఖజానాకు రూ.38,000 కోట్లు
న్యూఢిల్లీ, మే 25: కేంద్రంలోని మోదీ సర్కారు మరో ప్రభుత్వ రంగ సంస్థను అమ్మేస్తున్నది. హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ (హెచ్జెడ్ఎల్)లో కేంద్రానికున్న మొత్తం 29.58 శాతం వాటా (124.96 కోట్లకుపైగా షేర్లు) విక్రయానికి వీలుగా బుధవారం ఆర్థిక వ్యవహారాలపై క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) ఆమోదం తెలిపింది. దీంతో ఖజానాకు దాదాపు రూ.38,000 కోట్లు వస్తాయని సంబంధిత వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం (2022-23)లో ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ, వ్యూహాత్మక వాటాల విక్రయం ద్వారా రూ.65,000 కోట్ల నిధులను సమీకరించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే.
5 శాతమే కొంటాం: వేదాంత
హిందుస్థాన్ జింక్లో ఇప్పటికే మెజారిటీ వాటాను కలిగి ఉన్న వేదాంత.. రాబోయే వాటా విక్రయంలో కేవలం 5 శాతం షేర్లనే కొంటామంటున్నది. ఆఫర్పై షేర్ల ధర ఆధారంగా ఈ లావాదేవీకి దిగుతామని అనిల్ అగర్వాల్ నాయకత్వంలోని ఈ సంస్థ చెప్తున్నది. కాగా, బాంబే స్టాక్ ఎక్సేంజ్లో హెచ్జెడ్ఎల్ షేర్ విలువ 3.14 శాతం పెరిగి రూ.305.05 వద్ద ముగిసింది.
ప్రైవేటుకు ఐవోబీ, సెంట్రల్ బ్యాంకులు
ఇప్పటికే ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేసి వాటాలను అమ్ముకుంటున్న కేంద్ర ప్రభుత్వం.. రెండు బ్యాంకులను ప్రైవేట్పరం చేయాలని చూస్తున్నది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐవోబీ), సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సీబీఐ)లను అమ్మేయాలనే యోచనలో ఉన్నట్టు సమాచారం. సీసీఈఏ సమావేశం నేపథ్యంలో ఈ మేరకు సంబంధిత వర్గాల నుంచి సంకేతాలున్నాయి. క్యాబినెట్ కార్యదర్శి నేతృత్వంలోని కోర్ గ్రూప్ ఆఫ్ సెక్రటరీస్ సిఫార్సుతో ప్రధాని నాయకత్వంలోని క్యాబినెట్ దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ అదనపు రుణాలకు సంబంధించి ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తున్నది. పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకం తగ్గింపుతో వచ్చిన లక్ష కోట్ల రూపాయల ఆదాయ నష్టాన్ని భర్తీ చేసేందుకు మరిన్ని అప్పులు చేసే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. కాగా, జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణ ద్రవ్యోల్బణం కారణంతో ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం 5, 12, 18, 28 శ్లాబుల్లో రేట్లున్నాయి. వీటిని మూడు శ్లాబుల్లోకి తగ్గించాలని చూస్తున్నారు.
బీజేపీ పాలనలోనే నిర్వీర్యం
హిందుస్థాన్ జింక్ ప్రైవేటీకరణను గమనిస్తే.. ఆది నుంచి అంతం దాకా బీజేపీ పాలనలోనే సాగడం గమనార్హం. 2002లో అప్పటి ప్రధాన మంత్రి వాజపేయి హయాంలో సంస్థలోని 26 శాతం వాటాను తొలుత వేదాంత గ్రూప్నకు అమ్మేశారు. నెలల వ్యవధిలోనే మరో 20 శాతం వేదాంత చేతికి వెళ్లిపోయింది. 2003 నవంబర్లో ఇంకో 18.92 శాతం వాటాను వాజపేయి సర్కారు అమ్ముకున్నది. దీంతో సంస్థలో వేదాంత వాటా 64.92 శాతానికి చేరగా, ప్రభుత్వం నుంచి ప్రైవేట్ గుప్పిట్లోకి హిందుస్థాన్ జింక్ వెళ్లిపోయింది. ఇప్పుడు మిగిలిన 29.58 శాతం వాటాను మోదీ సర్కారు అమ్మేందుకు సిద్ధమైంది.