silver bar : పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో వెండి దిగుమతులపై కేంద్రం ఆంక్షలు విధించింది. ముఖ్యంగా 99.9 శాతం స్వచ్ఛత కలిగిన వెండి కడ్డీల దిగుమతులపై ఈ ఆంక్షలు అమలుకానున్నాయి. ఇకపై, ఇలాంటి వెండి కడ్డీలు దిగుమతి చేసుకోవాలంటే కేంద్రం అనుమతి తీసుకోవాల్సిందే. ఈ మేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) నోటిఫికేషన్ విడుదల చేసింది.
కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ విధానపరమైన సమీక్ష అనంతరం వెండి దిగుమతుల విధానంలో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని కేంద్రం తెలిపింది. ఇకపై వెండిని ఫ్రీ కేటగిరిలోంచి రెస్ట్రిక్టెడ్ (ఆంక్షలు కలిగిన) విభాగంలోకి మార్చింది. దీని ప్రకారం లైసెన్స్ కలిగిన సంస్తలు మాత్రమే ప్రభుత్వ అనుమతి తీసుకుని వెండిని దిగుమతి చేసుకోవాలి. స్వచ్ఛమైన వెండిపైనే కాకుండా.. ఇతర వెండి ఉత్పత్తులపై కూడా ఆంక్షలు అమలవుతాయి. బంగారం, వెండి దిగుమతుల్ని, కొనుగోళ్లను తగ్గించేందుకు కేంద్రం ఇటీవలే దిగుమతి సుంకాల్ని పెంచింది.
6 శాతం ఉన్న సుంకాల్ని 15 శాతానికి పెంచింది. అలాగే, బంగారం దిగుమతులపై 100 కేజీల పరిమితి విధించింది. అంతకుమించి బంగారం దిగుమతి చేసుకోవడానికి వీల్లేదు. గతంలో దీనిపై పరిమితి ఉండేది కాదు. దేశ ఆర్థిక పరిస్తితి దృష్ట్యా ప్రజలు బంగారం, వెండి కొనుగోళ్లు తగ్గించాలని ప్రధాని మోదీ ఇటీవల పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.