చర్లపల్లి, మే 20: కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్)కు మినీరత్న హోదా దక్కింది. ఈ సందర్భంగా కంపెనీ సీఎండీ అనురాగ్ కుమార్ మాట్లాడుతూ.. కార్మికులు, అధికారులు అంకిత భావంతో పనిచేయడం వల్లనే మినీరత్న హోదా లభించిందన్నారు. ఆర్ధిక మంత్రిత్వశాఖలోని పబ్లిక్ ఎంటర్ప్రైజ్(డీపీఈ) విభాగం నిర్దేశించిన అర్హతను సాధించినందుకు భారత అణుశక్తి విభాగం ఈసీఐఎల్కు మినీరత్న కేటగిరి-1 హోదాను కల్పించిందన్నారు.
స్వదేశీ పరిజ్ఞానంతో రక్షణ రంగానికి కావాల్సిన ఉత్పత్తులను అందిస్తున్నామని, మినీరత్న హోదాతో స్వయం ప్రతిపత్తిని సాధించడంతో పాటు దేశవ్యాప్తంగా ఈసీఐఎల్ ఖ్యాతి పెరిగిందన్నారు. ఎలక్ట్రానిక్ రంగంలో మరిన్ని ఉత్పత్తులను సాధించేందుకు అధికారులు, కార్మికులు మరింత కృషి చేయాలని ఆయన సూచించారు.