హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సమీపంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్(నిమ్జ్)కు కేంద్ర పర్యావరణశాఖ అనుమతులు లభించాయి. ఈ శాఖ ఆధీనంలోని ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో నిమ్జ్లో భూములను అభివృద్ధి చేసి ప్లాట్లు కేటాయించేందుకు, పెట్టుబడిదారులు పరిశ్రమలు నెలకొల్పేందుకు మార్గం సుగమమైంది. రాష్ట్ర పర్యావరణ, అటవీశాఖ ఇదివరకే అనుమతులు మంజూరు చేయగా, కేంద్ర పర్యావరణ అనుమతుల కోసం టీఎస్ఐఐసీ దరఖాస్తు చేసింది. కేంద్రం లేవనెత్తిన అభ్యంతరాలపై నివేదికనూ సమర్పించింది.
ఈ క్రమంలోనే మార్చి 24, 25 తేదీల్లో కేంద్ర పర్యావరణశాఖ నివేదికపై సంతృప్తి వ్యక్తంచేసి నిమ్జ్కు అనుమతులు మంజూరు చేసింది. సోమవారం ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. నిర్ధారిత ప్రమాణాల ప్రకారం గ్రీన్బెల్ట్ ఏరియా నిర్వహణ, వ్యర్థజలాల శుద్ధి ప్లాంటు, బఫర్జోన్ నిర్వహణ, రెడ్ క్యాటగిరీ పరిశ్రమలను ఒకేచోట ఏర్పాటు చేయడంతోపాటు సమీప గ్రామాలకు కనీసం 500-700 మీటర్లు దూరంగా ఉండేలా చూడాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. 2011లో ప్రకటించిన జాతీయ తయారీ విధానంలో భాగంగా, తెలంగాణ ఏర్పడిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తయారీ రంగాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో నిమ్జ్ను ఏర్పాటు చేస్తున్నది.
నిమ్జ్కు అనుకూలతలు
కేవలం 13 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న సింగూరు జలాశయం నుంచి నిమ్జ్ నీటి అవసరాలు తీరనున్నాయి. సమీపంలోని సదాశివపేట, శంకర్పల్లి విద్యుత్తు సబ్స్టేషన్ల నుంచి విద్యుత్తు సరఫరా చేసే వీలున్నది. నిమ్జ్ నుంచి రోజుకు 65 మిలియన్ లీటర్ల వ్యర్థజలాలు ఉత్పత్తవుతాయని అంచనా. వీటి శుద్ధికి ట్రీట్మెంట్ ప్లాంట్ల ఏర్పాటుకు ఇప్పటికే ప్రణాళిక రూపొందించారు. నిమ్జ్ అభివృద్ధి కోసం టీఎస్ఐఐసీ ఎస్పీవీ (స్పెషల్ పర్పస్ వెహికిల్)ని ఏర్పాటు చేసింది. పుణె-మచిలీపట్నం హైవే, సంగారెడ్డి-నాందేడ్ హైవే, వికారాబాద్-పర్లీ రైల్వే లైన్, శంషాబాద్ ఎయిర్పోర్టుతోపాటు 600 కిలోమీటర్ల పరిధిలో కృష్ణపట్నం సీపోర్టు ఉండటం నిమ్జ్కు అనుకూలతలు.
తయారీ రంగ పరిశ్రమలకు భూములు
జహీరాబాద్ నిమ్జ్ స్వరూపం
12,635 ఎకరాలు ప్రాజెక్టు విస్తీర్ణం
3,500 ఎకరాలు తొలిదశ భూసేకరణ లక్ష్యం
2,887ఎకరాలు పూర్తయిన భూ సేకరణ
13,300 కోట్లు ప్రాజెక్టు అంచనా వ్యయం
60,000 కోట్లు పెట్టుబడుల అంచనా
2.77 లక్షలు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు