కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థికంగా బలోపేతానికి సిద్ధపడింది. దేశవ్యాప్తంగా 13 శాతం శాఖలను మూసివేయడం లేదా విలీనం చేయాలని నిర్ణయించింది. బ్యాంక్ కొన్నేండ్లుగా ఒత్తిడికి గురవుతున్నదని సమాచారం. దేశవ్యాప్తంగా 600 శాఖలను మూసివేయడం గానీ, నష్టాల్లో ఉన్న శాఖలను సమీప శాఖల్లో విలీనం చేయడం గానీ చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం.
వచ్చే ఏడాది మార్చి నాటికి శాఖల కుదింపు నిర్ణయం అమల్లోకి రానున్నదని ఓ వార్త సంస్థ కథనం. బ్యాంక్ ఆర్థిక స్థితిగతులను మెరుగు పరిచేందుకు నాన్కోర్ అసెట్స్, ఇండ్ల స్థలాల వంటి వాటిని విక్రయించాలని నిర్ణయించిందని సమాచారం.ఇంతకుముందు పొదుపు చర్యలు తీసుకుంటున్నట్లు వార్తలొచ్చినా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖల మూసివేత అంశం ప్రస్తావనకు రాలేదు.
100 ఏండ్లకు పైగా చరిత్ర గల సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఇప్పుడు 4,594 శాఖలు ఉన్నాయి. 2017లో ఆర్బీఐ రూపొందించిన మార్గదర్శకాలను, నిబంధనలను కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉల్లంఘించాయని వినికిడి. ఆ తర్వాత సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మినహా మిగతా బ్యాంకులు కోలుకున్నాయి. శాఖల కుదింపు లేదా విలీనంపై స్పందించడానికి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందుబాటులోకి రాలేదు.