CBRE | న్యూఢిల్లీ, మార్చి 13: లగ్జరీ బ్రాండ్ల సంస్థలు కొత్తగా తమ రిటైల్ స్టోర్లను తెరిచేందుకు రద్దీ ప్రాంతాల్లోని షాపింగ్ మాల్స్నే ఎంపిక చేసుకుంటున్నట్టు తేలింది. గత ఏడాది మార్కెట్ ట్రెండ్పై రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సీబీఆర్ఈ, పీహెచ్డీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (పీహెచ్డీసీసీఐ) బుధవారం సంయుక్తంగా ఓ నివేదికను విడుదల చేశాయి. 2022 నుంచి 2023 వరకు వివిధ రకాల రిటైల్ రంగాల వ్యాప్తంగా లగ్జరీ రిటైల్ లీజింగ్ తీరుతెన్నులను హైలైట్ చేస్తూ ‘భారతీయ లగ్జె‘రీ’ ఆరోహణం’ పేరిట ఈ రిపోర్టును తెచ్చాయి. హైదరాబాద్తోపాటు ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై, బెంగళూరు, కోల్కతా, పుణె, అహ్మదాబాద్, చెన్నై నగరాల్లోని లీజింగ్ కార్యకలాపాల ఆధారంగా ఈ నివేదిక రూపొందింది. ‘గత ఏడాది దేశంలోని 8 ప్రధాన నగరాల్లో తమ రిటైల్ స్టోర్లను తెరిచేందుకు లగ్జరీ బ్రాండ్ల కంపెనీలు ప్రధాన కూడళ్లను, జన సంచారం ఎక్కువగా ఉండే చోట్లనే ఎంచుకున్నాయి’ అని సీబీఆర్ఈ తెలిపింది.
లగ్జరీ రిటైల్ రంగంలో భారత్ స్థానం చెప్పుకోదగ్గ స్థాయిలోనే మెరుగుపడుతున్నది. పెరుగుతున్న విదేశీ పర్యాటకుల నేపథ్యంలో అంతర్జాతీయ ప్రముఖ బ్రాండ్లు దేశంలోకి అడుగుపెడుతున్నాయి. ముఖ్యంగా లగ్జరీ బ్రాండ్లకు చెందిన వాచీలు, ఆభరణాలు, దుస్తులు, పాదరక్షలకు డిమాండ్ ఉన్నది. మున్ముందూ ఈ ట్రెండ్ ఇలాగే సాగుతుందని చెప్పవచ్చు.