Mehul Chowksi | పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) స్కాం కేసులో నిందితుడు మెహుల్ చౌక్సీపై సీబీఐ మరో కేసు నమోదు చేసింది. 2014-18 మధ్య ఇండస్ట్రీయల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్సీఐ) ను తప్పుదోవ పట్టించి చౌక్సీ, ఆయన సారధ్యంలోని గీతాంజలి జెమ్స్ రూ.22 కోట్లు కొట్టేశారని అభియోగం. గత నెల 28న సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. గీతాంజలి జెమ్స్, దాని డైరెక్టర్ మెహుల్ చౌక్సీ, ఇతర నిందితులు నేరపూరితంగా కుట్ర చేశారని ఐఎఫ్సీఐ ముంబై అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (లా) యామినీ దాస్ ఫిర్యాదు చేశారు.
దీర్ఘకాలిక వర్కింగ్ క్యాపిటల్ కావాలని, అందుకు ఆర్థిక సాయం చేయాలని గీతాంజలి జెమ్స్, మెహుల్ చౌక్సీ తమను సంప్రదించారని యామినీ దాస్ తన ఫిర్యాదులో తెలిపారు. ఐఎఫ్సీఐని ప్రలోభ పరిచి 2016 మార్ఇచలో రూ.25 కోట్ల కార్పొరేట్ రుణం మంజూరు చేయించుకున్నారన్నారు. ఈ రుణం గీతాంజలి జెమ్స్కు పంపిణీ చేశామని తెలిపింది. గీతాంజలి జెమ్స్, చౌక్సీ పలుసార్లు కలిసి విజ్ఞప్తి చేసిన మీదట సూరజ్మాల్ లల్లూభాయి అండ్ కో, నరేంద్ర ఝవేరీ, ప్రదీప్ సీ షా, శ్రెనిక్ ఆర్ షాల ఆస్తుల విలువ అంచనా వేసినట్లు ఐఎఫ్సీఐ తెలిపింది.
రెండు రెట్ల పూచీకత్తుతో రూ.25 కోట్ల రుణం మంజూరు చేసింది ఐఎఫ్సీఐ. కానీ తర్వాత రుణ వాయిదాలు చెల్లించడంలో విఫలమయ్యారని ఆరోపణలు వచ్చాయి. తమ విచారణలో మెహుల్ చౌక్సీ మోసగాడని, నిజాయితీ లేని వాడని తేలిందని ఐఎఫ్సీఐ తెలిపింది. ఆభరణాల విలువ ఎక్కువ చూపి రుణాలు తీసుకున్నాడన్నది. రుణ వాయిదాలు చెల్లించకపోవడంతో 2018 జూన్ 30న దీన్ని మొండి బకాయిగా ప్రకటించినట్లు ఐఎఫ్సీఐ తెలిపింది. దీనివల్ల ఐఎఫ్సీఐకి రూ.22,06,20,106 నష్టం వాటిల్లిందని వివరించింది.