NSE Chitra Ramakrishna | నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) మాజీ సీఈవో కం మేనేజింగ్ డైరెక్టర్ చిత్రా రామకృష్ణ మరిన్ని కష్టాల్లో చిక్కుకున్నారు. ఇప్పటికే గవర్నెన్స్, కో-లొకేషన్ స్కామ్ కేసులో అభియోగాలతో జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్నారు. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో పని చేస్తున్న ఉద్యోగుల ఫోన్లు ట్యాపింగ్ చేశారన్న అభియోగంపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కేసు నమోదు చేసింది. చిత్రా రామకృష్ణతోపాటు ముంబై మాజీ పోలీస్ కమిషనర్ సంజయ్ పాండేపైనా కేసు నమోదైంది. కేంద్ర హోంశాఖ ఫిర్యాదు మేరకు చిత్రా రామకృష్ణ, సంజయ్ పాండేలపై సీబీఐ కేసులు పెట్టింది. వీరిద్దరితోపాటు ఎన్ఎస్ఈ మాజీ సీఈవో కం మేనేజింగ్ డైరెక్టర్ రవి నరేన్ పేరు కూడా ఎఫ్ఐఆర్లో చేర్చారు.
చిత్రా రామకృష్ణ, సంజయ్ పాండే, రవి నరేన్లపై కేసు నమోదైన నేపథ్యంలో సీబీఐ శుక్రవారం ముంబై, పుణెల్లో పది చోట్ల తనిఖీలు జరుపుతున్నది. సంజయ్ పాండేకు చెందిన ఐసెక్ సెక్యూరిటీ ప్రైవేట్ లిమిటెడ్ ఉద్యోగులు 2009-17 మధ్య నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) ఉద్యోగుల ఫోన్లను ట్యాప్ చేశారు. ఎన్ఎస్ఈ కో-లొకేషన్ స్కామ్ కేసు సమయంలోనే ఎక్స్చేంజ్ లావాదేవీలను ఐసెక్ సెక్యూరిటీ సెక్యూరిటీ అడిటింగ్ చేసింది.
ముంబై నగర పోలీస్ కమిషనర్గా సంజయ్ పాండే రాజీనామా చేసిన తర్వాత 2001లో ఐసెక్ సెక్యూరిటీ సంస్థను స్థాపించారు. 2006 వరకు ఆ సంస్థ డైరెక్టర్గా కొనసాగారు. తదుపరి ఐసెక్ సెక్యూరిటీ సంస్థ బాధ్యతలను తన తల్లి, కుమారులకు అప్పగించారు. అయితే, సంజయ్ పాండే రాజీనామాను మహారాష్ట్ర సర్కార్ ఆమోదించలేదు. దీంతో ఆయన తిరిగి విధుల్లో చేరిన ప్రభుత్వం బాధ్యతలు అప్పగించలేదు.