CBDT | 2024 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు 20శాతం పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.15.60 లక్షల కోట్లుగా ఉండగా.. మొత్తం ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం సవరించిన అంచనాల్లో 80శాతం. ప్రత్యక్ష పన్ను వసూళ్లలో బలమైన వృద్ధి కనిపిస్తుందని సీబీడీటీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ నెల ఫిబ్రవరి 10 వరకు ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ.18.38లక్షల కోట్లు. గతేడాది కంటే 17.30శాతం ఎక్కువ. ప్రత్యక్ష పన్ను వసూళ్ల నుంచి నికర రీఫండ్ పోగా.. రూ.15.60 లక్షల కోట్లు. గత ఏడాది నికర వసూళ్లతో పోలిస్తే 20.25 శాతం ఎక్కువ.
అదే సమయంలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి వసూళ్లు ప్రభుత్వ ప్రత్యక్ష పన్ను వసూళ్ల సవరించిన అంచనాలో 80.23 శాతం. ఏప్రిల్ ఒకటి, 2023 నుంచి 2024 ఫిబ్రవరి 10 వరకు రూ.2.77లక్షల కోట్లు రీఫండ్ అయ్యాయి. కార్పొరేట్ ఆదాయపు, వ్యక్తిగత ఆదాయపు పన్ను సైతం పెరిగినట్లు సీబీడీటీ పేర్కొంది. కార్పొరేట్ ఆదాయపు పన్ను 9.16 శాతం పెరుగుదల నమోదైంది. వ్యక్తిగత ఆదాయపు పన్ను 25.67 శాతం పెరిగినట్లు సీబీడీటీ తెలిపింది. రీఫండ్ల కోసం సర్దుబాటు చేసిన తర్వాత.. పెరుగుదల 13.57 శాతం, 26.91 శాతంగా నమోదైనట్లు వివరించింది.