CBDT | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: పాత పన్ను డిమాండ్ల ఉపసంహరణకు సంబంధించి ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు (సీబీడీటీ) ఓ కీలక నిర్ణయం తీసుకున్నది. 2015-16 మదింపు సంవత్సరం వరకున్న చిన్న పన్ను డిమాండ్ల ఉపసంహరణ కోసం ఒక్కో పన్ను చెల్లింపుదారునికి పరిమితిని లక్ష రూపాయలుగా నిర్దేశించింది. ఇటీవలి కేంద్ర బడ్జెట్లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన పథకం ప్రకారం ఈ మేరకు స్పష్టం చేసింది. 2010-11 మదింపు సంవత్సరం కోసం రూ.25,000 వరకున్న ట్యాక్స్ డిమాండ్లను, 2011-12 నుంచి 2015-16 మదింపు సంవత్సరాల కోసం రూ.10,000 వరకున్న ట్యాక్స్ డిమాండ్లను వెనక్కి తీసుకుంటామని ఈ నెల 1న పార్లమెంట్లో బడ్జెట్ ప్రకటన సందర్భంగా మంత్రి సీతారామన్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే ఒక్కో పన్ను చెల్లింపుదారునికి ఈ ట్యాక్స్ డిమాండ్ల ఉపసంహరణ పరిమితిని మొత్తంగా లక్ష రూపాయలుగా నిర్ణయించినట్టు సీబీడీటీ చెప్తున్నది. అయితే ఐటీ చట్టంలోని టీడీఎస్ లేదా టీసీఎస్ కింద ట్యాక్స్ డిడక్టర్స్ లేదా ట్యాక్స్ కలెక్టర్లకు వచ్చిన డిమాండ్లకు ఈ నిర్ణయం వర్తించదు. ఇకపోతే ట్యాక్స్ డిమాండ్లో అసలు, వడ్డీ, జరిమానా లేదా ఫీజు, సర్చార్జీ అన్నీ ఈ లక్ష రూపాయల పరిమితి లెక్కలోకే వస్తాయి. కాగా, ఈ ఏడాది జనవరి 31 వరకున్న ఆదాయ పన్ను, సంపద పన్ను, బహుమతి పన్నులకు సంబంధించిన పన్ను డిమాండ్ల బకాయిలనూ ఈ లక్ష రూపాయల గరిష్ఠ పరిమితికి లోబడే పరిగణనలోకి తీసుకుంటామని సీబీడీటీ తెలిపింది.