న్యూఢిల్లీ : క్యాసినోలు, ఆన్లైన్ గేమింగ్, రేస్ కోర్సులపై 28 శాతం జీఎస్టీ విధించాలని మంత్రుల బృందం నివేదిక ఖరారు చేసింది. వీటిపై జీఎస్టీ రేటును సమీక్షించేందుకు ప్రభుత్వం మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసింది. క్యాసినోలు, ఆన్లైన్ గేమింగ్, రేస్ కోర్సులపై 28 శాతం జీఎస్టీని సిఫార్సు చేస్తూ మంత్రుల బృందం ఇచ్చిన నివేదికపై తదుపరి జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటారు.
మేఘాలయ సీఎం కన్రాడ్ సంగ్మా అధ్యక్షతన ఇటీవల జరిగిన మంత్రుల బృందం భేటీలో ఈ సేవలపై పన్ను రేటును 28 శాతంగా నిర్ధారిస్తూ ఏకగ్రీవంగా నిర్ణయించింది. మంత్రుల బృందం బుధవారం మరోసారి సమావేశమై ఈ సేవలపై పన్ను రేటు విధింపునకు సేవలను మదింపు చేసే విధానాన్ని ఖరారు చేసింది.
క్యాసినోలు, రేసు కోర్సులు, ఆన్లైన్ గేమింగ్పై మంత్రుల బృందం (జీఓఎం) ఏకాభిప్రాయానికి వచ్చిందని, ఈ సేవలపై జీఎస్టీ రేటుపై తాము ఖరారు చేసిన నివేదికను ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు ఒకట్రెండు రోజుల్లో అందచేస్తామని, తదుపరి జీఎస్టీ కౌన్సిల్ భేటీలో దీనిపై చర్చిస్తారని సంగ్మా ట్వీట్ చేశారు.