సిటీబ్యూరో, సెప్టెంబర్ 23(నమస్తే తెలంగాణ): నిబంధనలకు విరుద్దంగా బ్యాంకుల వద్ద కస్టమర్ల షేర్లను తాకట్టు పెట్టి వేలాది కోట్ల రూపాయలు తీసుకొని భారీ మోసాలకు పాల్పడ్డ కార్వీ స్టాక్ బ్రోకింగ్ (కేఎస్బీఎల్) చైర్మన్ పార్థసారథి అతనికి సహకరించిన వారిపై బెంగళూరులోనూ నాలుగు కేసులు నమోదయ్యాయి. ఇండస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకులను మోసం చేశారని ఆయా బ్యాంకులు ఇచ్చిన ఫిర్యాదులపై ఈ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులలో రూ.1,050 కోట్లు ఆయా బ్యాంకులకు ఎగనామం పెట్టారు. ఈ క్రమంలోనే బెంగుళూరులో నమోదైన కేసులలోను రూ. 350 కోట్ల మోసం ఉండటంతో, సంస్థపై బెంగళూరు పోలీసులు కూడా దర్యాప్తు మొదలు పెట్టారు. అందులో భాగంగా గురువారం సీసీఎస్కు వచ్చిన బెంగళూరు పోలీసులు, ఇక్కడ నమోదైన కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. తొమ్మిది బినామీ కంపెనీలు సృష్టించి, బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను అందులోకి మళ్లించిన విధానం గూర్చి సీసీఎస్ దర్యాప్తులో అడిగి తెలుసుకున్నారు.