Cars Costly | కర్బన ఉద్గారాల నియంత్రణకు కేంద్రం రెండో దశ బీఎస్-6 ప్రమాణాలను అమలు చేయాలని తేల్చి చెప్పింది. ఇందుకోసం ఎప్పటికప్పుడు కార్లు, ఇతర ఫోర్ వీలర్స్ నుంచి వెలువడే కర్బన ఉద్గారాలను అనునిత్యం పర్యవేక్షించడానికి వాటిల్లో రియల్ డ్రైవింగ్ ఎమిషన్ (ఆర్డీఈ) తప్పనిసరిగా అమర్చాలి. దీంతో కార్ల తయారీ ఖర్చు పెరుగుతుంది. ఇలా పెరిగిన ఖర్చును కస్టమర్లపైకి మళ్లించాయి.. దాదాపు అన్ని కార్ల తయారీ సంస్థలు ఈ ఏడాది ఐదు శాతం ధరలు పెంచేశాయి. ఈ ఏడాది వరకూ ఇదే ట్రెండ్ కొనసాగుతుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
ఇంతకుముందు జనవరిలో తొలుత కార్ల ధరలు పెంచిన ఆటోమొబైల్ సంస్థలు.. మార్చి-ఏప్రిల్, మే నెలల్లో మళ్లీ పెంచాయి. కియా మోటార్ ఇండియా, ఎంజీ మోటార్ ఇండియా మార్చిలో ధరలు పెంచాయి. మారుతి సుజుకి, మహీంద్రా అండ్ మహీంద్రా గత నెలలో రెండోసారి పెంచాయి.
హోండా కార్స్ కొన్ని మోడల్ కార్ల ధరలు పెంచేసింది.. మరికొన్ని మోడల్ కార్ల ధరలు వచ్చేనెలలో పెంచేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ నెలలో టాటా మోటార్స్ కార్లతోపాటు కమర్షియల్ వెహికల్స్ మీద 0.6 శాతం నుంచి ఐదు శాతం ధరలు పెంచేసింది.
కార్లలోనూ, కమర్షియల్ వెహికల్స్ లోనూ ఆర్డీఈ పరికరం వాడాల్సి రావడంతో కార్ల ధరలు పెరిగాయని ఆటోమొబైల్ నిపుణులు చెబుతున్నారు. క్రమంగా ఈ ఏడాది ప్రారంభం నుంచి క్రమంగా కార్ల ధరలు పెరుగుతన్నాయి. మళ్లీ వచ్చేనెలలో వివిధ మోడల్ కార్లపై రూ.3000-రూ.20 వేల వరకు పెరుగుతాయని చెబుతున్నారు. సెప్టెంబర్ తర్వాత మరో దఫా 0.5 శాతం నుంచి 2శాతం పెరగనున్నాయని తెలుస్తున్నది.