Cars-SUVs | ఏప్రిల్ నెల మొదలవుతున్నది. అంటే నూతన ఆర్థిక సంవత్సరం షురూ అన్నమాట.. పూర్తిగా ఆర్థిక వ్యవహారాలు.. లావాదేవీల్లో సమూల మార్పులు జరుగుతుంటాయి.. అన్ని రంగాల్లోనూ మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి.. అలాగే ఆటోమొబైల్ రంగంలో కొన్ని మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నారు. మరింతగా కర్బన ఉద్గారాలను నియంత్రించాలన్న తపనతో కేంద్రం రెండో దశ బీఎస్-6 ప్రమాణాలు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి తెస్తున్నది. దీని ప్రకారం వెహికల్స్ నుంచి నిర్దిష్ట స్థాయికి మించి కర్బన ఉద్గారాలు వెలువడకూడదు. అలా వెలువడకూడదంటే ఆయా కార్ల ఇంజిన్ల నుంచి వెలువడే ఉద్గారాలను ఎప్పటికప్పుడు అంచనా వేయడానికి రియల్ డ్రైవింగ్ ఎమిషన్ (ఆర్డీఈ) పరికరం అమర్చాలి. ఇది సెల్ఫ్ డయాగ్నస్టిక్ డివైజ్. ఇది అనునిత్యం ఇంజిన్ నుంచి వెలువడే కర్బన ఉద్గారాలను లెక్క గట్టి.. తెలియజేస్తూ ఉంటుంది. కర్బన ఉద్గారాల నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా క్యాటలిక్ కన్వర్టర్, ఆక్సిజన్ సెన్సర్లు పని చేస్తాయా.. లేదా అని పర్యవేక్షిస్తూ సూచనలు చేస్తూ ఉంటుంది. తదనుగుణంగా కారు డ్రైవర్ మార్పులు, చేర్పులు చేస్తుండాలి. ఈ ఆర్డీఈ పరికరం కాసింత కాస్ట్ ఎక్కువే.
ఈ ఆర్డీఈ పరికరం అమర్చేందుకు కార్ల తయారీ దార్లపై ఖర్చు పెరుగుతుంది. దీన్ని కస్టమర్లపై మోపేస్తాయి. కానీ, మరీ ఎక్కువ భారం పడకుండా ఉండాలంటే ఎంట్రీ లెవెల్ కార్లు.. మిడ్ రేంజ్ కార్లు మార్కెట్ నుంచి ఉపసంహరించాలని మారుతి సుజుకి నుంచి హోండా కార్స్ వరకు కార్ల తయారీ సంస్థలు నిర్ణయించాయి.
ఫిప్త్ జనరేషన్ హోండా సిటీ కారును ఆవిష్కరించిన హోండా కార్స్.. ఫోర్త్ జనరేషన్ కారు కూడా కలిపి అమ్మాలనుకుంది. హోండా సిటీ ఫిఫ్త్ జనరేషన్ కారు ధర రూ.11.49 లక్షల నుంచి మొదలవుతుంది.
కానీ ఆర్డీఈ నిబంధన అమల్లోకి వస్తుండటంతో భారత్ మార్కెట్లో ఫోర్త్ జనరేషన్ సిటీ కారు సేల్స్ నిలిపేయనున్నది.
డబ్ల్యూఆర్-వీ కంపాక్ట్ ఎస్యూవీ కారు కూడా శనివారం నుంచి నిలిపేస్తున్నది. డబ్ల్యూఆర్-వీ కారు 1.2 లీటర్ల పెట్రోల్, 1.5 లీటర్ల డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో విక్రయిస్తూ వచ్చింది హోండా..
హోండా ఫోర్త్ జనరేషన్ సిటీ, డబ్ల్యూ ఆర్-వీ తర్వాత మార్కెట్ నుంచి హోండా కార్స్ తప్పించే మోడల్ కార్లలో హోండా జాజ్ కూడా ఉందని తెలుస్తున్నది.
కార్ల తయారీ సంస్థల్లో పెద్దన్న మారుతి సుజుకి తన ఎంట్రీ లెవెల్ కారు ఆల్టో 800 సేల్స్ కూడా నిలిపేయనున్నది. ఇది 800 సీసీ ఇంజిన్ క్యాటగిరీ కారు. ఆర్డీఈ నిబంధన వల్లే నిలిచిపోనున్నది. ఈ కారు ఇంజిన్ 40 బీహెచ్పీ విద్యుత్, 60 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది.
దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్ ఇటీవలే మార్కెట్లోకి ఐ-20 డీజిల్ వేరియంట్ నిలిపేస్తున్నది. ఐ-20 డీజిల్ వేరియంట్ కార్ల సేల్స్ అన్నీ కంపెనీ ఆపివేస్తున్నది. ఒకవేళ డీలర్ దగ్గర ఉంటే బుక్ చేసుకోవచ్చు.
భారత్ మార్కెట్లో నుంచి తప్పుకునే మరో కారు మహీంద్రా ఆల్టూరస్ జీ4. ఈ కారు 2.2 లీటర్ల టర్బో డీజిల్ ఇంజిన్తో వస్తున్నది. ఇది 181 బీహెచ్పీ విద్యుత్, 420 ఎన్ఎం టార్చిని వెలువరిస్తుంది.
మరో కార్ల తయారీ సంస్థ నిస్సాన్ తన ఎస్యూవీ మోడల్ ‘కిక్స్’ కార్ల బుకింగ్స్ తాత్కాలికంగా నిలిపేసింది. ఈ కారు 1.3 లీటర్ల పెట్రోల్, 1.5 లీటర్ల ఎన్ఏ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లతో డిజైన్ చేశారు.
రెనాల్ట్ ఇండియా సంస్థ.. దేశీయ మార్కెట్ నుంచి హ్యాచ్బ్యాక్ కారు క్విడ్ 800సీసీ వేరియంట్లను డిస్కంటిన్యూ చేయనున్నది. 800 సీసీ ఇంజిన్లు 53 బీహెచ్పీ విద్యుత్, 73 ఎన్ఎం టార్చి వెలువరిస్తాయి.
ఇటీవలే అప్డేటెడ్ ఇన్నోవా క్రిస్టా కారును టయోటా భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. కానీ డీజిల్ వేరియంట్ కార్ల పునః ప్రవేశంతో ఎంవీపీ పెట్రోల్ వేరియంట్లు డిస్ కంటిన్యూ చేస్తున్నది. పెట్రోల్ క్రిస్టా కారు 2.7 లీటర్ల ఎన్ఏ పెట్రోల్ సామర్థ్యంతో కూడిన ఇంజిన్ కలిగి ఉంటుంది.
స్కోడా ఆటో ఇండియా తన సెడాన కార్లు ఒక్టావియా, సూపర్బ్ మోడల్స్ను డిస్కంటిన్యూ చేయనున్నది. ఈ కార్లు 2.0-లీటర్ల టర్బో పెట్రోల్ ఇంజిన్లతో డిజైన్ చేశారు. 7-స్పీడ్ డీఎస్జీ గేర్ బాక్స్ కలిగి ఉంటాయి.