ముంబై, డిసెంబర్ 20: కార్డ్ టోకెనైజేషన్ సదుపాయాన్ని బుధవారం బ్యాంక్, ఇతర కార్డ్ జారీ సంస్థల స్థాయిలోనూ పరిచయం చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ). దీంతో వివిధ ఈ-కామర్స్ యాప్లతో తమ ప్రస్తుత ఖాతాలను కార్డుదారులు ఇంకా సులువుగా అనుసంధానం చేసుకునే సౌకర్యాన్ని కల్పించింది. ఇప్పటిదాకా వ్యాపారుల యాప్ లేదా వెబ్పేజీల ద్వారానే కార్డ్-ఆన్-ఫైల్ (సీవోఎఫ్) టోకెనైజేషన్ జరుగుతున్నది. కాగా, సీవోఎఫ్ అనేది కార్డ్, టోకెన్ విజ్ఞప్తిదారుడు (కస్టమర్), వ్యాపారి కలయిక కోసం 16 అంకెల యూనిక్ నెంబర్ టోకెన్.
టోకెనైజేషన్ ద్వారా కార్డుదారులు తమ కార్డులతో ఏదైనా కొన్నప్పుడు స్వైపింగ్ సమయంలో సదరు కార్డు వాస్తవ వివరాలకు బదులు టోకెన్ వివరాలు మాత్రమే వ్యాపారుల వద్ద రికార్డ్ అవుతాయి. కార్డు టోకెనైజేషన్ వల్ల కార్డుదారులు మరింత సురక్షితంగా లావాదేవీలు జరుపుకోవచ్చని, ఎటువంటి మోసాలకు ఆస్కారం ఉండదని ఆర్బీఐ చెప్తున్నది. సీవోఎఫ్ టోకెనైజేషన్ను 2021 సెప్టెంబర్లో ఆర్బీఐ పరిచయం చేసింది. అయినప్పటికీ 2022 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి తెచ్చింది. ఇప్పుడు కార్డుదారుల సౌకర్యార్థం టోకెనైజేషన్ను సులభం చేసింది.