Indian Car Budget | కరోనా మహమ్మారి తర్వాత అందరూ పర్సనల్ మొబిలిటీకే మొగ్గు చూపుతున్నారు. సుదూర ప్రయాణాలు.. ప్రత్యేకించి సొంతూళ్లకు వెళ్లాలనుకున్నా.. టూరిస్ట్ కేంద్రాలకు వెళ్లాలనుకున్నా సొంతంగా కారు ఉంటే బెటర్ అన్న అభిప్రాయం ప్రతి ఒక్కరిలోనూ.. ప్రత్యేకించి మిలియనిల్స్లో పెరుగుతున్నది. కొత్త కారు కాకపోయినా యూజ్డ్ కారైనా కొనుక్కుందాం అనే భావన ఎక్కువవుతున్నది. బ్యాంకులు కూడా యూజ్డ్ కార్ల కొనుగోలుకు రుణాలిస్తున్నాయి. ఇంకేం.. 2021తో పోలిస్తే 2022లో భారతీయుల సగటు కారు కొనుగోలు బడ్జెట్ 30 శాతం పెరిగిందని తేలింది.
గతంతో పోలిస్తే యూజ్డ్ కారు కొనుగోలు చేయడానికి రూ.6 లక్షలైనా ఖర్చు చేయడానికి వెనుకంజ వేయడం లేదు. సేఫ్టీ, క్వాలిటీకి ప్రాధాన్యం ఇస్తున్న యువత అధిక మొత్తంలో ఖర్చు చేసేందుకు సై అంటున్నారని `కార్ 24` అనే సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. ఏడాదిలో ఒకటి కంటే ఎక్కువ కార్లు కొన్నవారు 81 శాతం పెరిగారు. ఈ సర్వే వివరాలపై ఓ లుక్కేద్దామా..
* మెజారిటీ కార్ల కొనుగోలుదారులు 35 ఏండ్ల లోపు వారే.
* సగటు కారు కొనుగోలు ధర రూ.6 లక్షలకు పెరుగుదల
* 2022లో ఫైనాన్స్ ద్వారా కార్ల కొనుగోళ్లు ఎక్కువ.
* హాట్ కేక్స్లా వైట్, గ్రే, రెడ్, బ్లాక్ కలర్ కార్లు.
* గరిష్టంగా సెడాన్ కార్లు కొనుగోలు చేసిన బెంగళూరు వాసులు.
* అత్యధిక కార్ల విక్రేతలు ఢిల్లీ వాసులు.
* అత్యంత ఖరీదైన కారు `మెర్సిడెస్ సీ క్లాస్` పుణెలో విక్రయం.
* ఆరేండ్ల లోన్ టెన్యూర్ అత్యంత పాపులర్.
* కార్ల కొనుగోలుదారుల సగటు ఈఎంఐ రూ.11,500
2022 తొలి త్రైమాసికంతో పోలిస్తే అక్టోబర్- డిసెంబర్ త్రైమాసికంలో యూజ్డ్ కార్ల సేల్స్ 75 శాతం పెరిగాయి. వాటిల్లో మారుతి బ్రాండ్ ప్రతి ఒక్కరి చాయిస్గా నిలిచింది. ప్రతి ముగ్గురిలో ఒకరు మారుతి కారు కొనుగోలు చేశారు. న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, కోల్కతా, లక్నో, పుణె, అహ్మదాబాద్ల్లో అత్యధిక మారుతి కార్ల విక్రయాలు సాగాయి.
మారుతిలో స్విఫ్ట్, బాలెనో, ఆల్టో, వాగన్ ఆర్, సెలెరియో మోడల్ కార్లు బెస్ట్ సెల్లింగ్ కార్లుగా నిలిచాయి. తర్వాతీ స్థానంలో హ్యుండాయ్, హోండా, రెనాల్ట్, ఫోర్డ్ కార్లకు ప్రియార్టీ ఇచ్చారు. ద్వితీయ శ్రేణి నగరాలు పుణె, అహ్మదాబాద్ల్లో అత్యధిక కార్ల డెలివరీలు జరిగితే అత్యంత పాపులర్ మోడల్గా బాలెనో నిలిచింది. పుణె వాసి ఒకరు మెర్సిడెస్-బెంజ్ సీ క్లాస్ మోడల్ కారు సొంతం చేసుకోవడానికి రూ.33 లక్షలు ఖర్చు చేశాడు. లక్నోలో అత్యధికంగా మారుతి విటారా బ్రెజా కార్లు అమ్ముడయ్యాయి.
దేశంలోని ప్రధాన మెట్రో నగరాల పరిధిలో బెంగళూరులో అత్యధిక యూజ్డ్ కార్లు అమ్ముడు పోయాయి. బెంగళూరుతోపాటు, ఢిల్లీ, చెన్నై నగరాల్లో స్విఫ్ట్ పాపులర్ మోడల్గా నిలిచింది. ముంబై వాసులు వ్యాగన్-ఆర్పై మనస్సు పారేసుకున్నారు.