న్యూఢిల్లీ, జూలై 24:ప్రభుత్వరంగ సంస్థ కెనరా బ్యాంక్ రికార్డు స్థాయిలో లాభాలను ఆర్జించింది. మొండి బకాయిలు తగ్గుముఖం పట్టడం, వడ్డీల మీద వచ్చే ఆదాయం పెరగడంతో గత త్రైమాసికపు లాభంలో 75 శాతం వృద్ధి నమోదైంది. ఏప్రిల్-జూన్ మధ్యకాలానికిగాను బ్యాంక్ రూ.3,535 కోట్ల లాభాన్ని గడించింది. ఏడాది క్రితం ఇది రూ.2,022 కోట్లుగా ఉన్నది. 2022-23 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.23,352 కోట్లుగా ఉన్న బ్యాంక్ ఆదాయం గత త్రైమాసికానికిగాను రూ.29,828 కోట్లకు చేరుకున్నట్లు పేర్కొంది. దీంట్లో వడ్డీల మీద వచ్చే ఆదాయం రూ.18,177 కోట్ల నుంచి రూ.25,004 కోట్లకు చేరుకున్నట్లు తెలిపింది. బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 6.98 శాతం నుంచి 5.15 శాతానికి దిగిరాగా, నికర ఎన్పీఏ 2.48 శాతం నుంచి 1.57 శాతానికి దిగొచ్చాయి.
అలాగే బ్యాంక్ మొండి బకాయిలు రూ.2,673 కోట్ల నుంచి రూ.2,418 కోట్లకు తగ్గాయి. ఈ సందర్భంగా కెనరా బ్యాంక్ ఎండీ కే సత్యనారాయణ రాజు మాట్లాడుతూ…ఈ ఏడాది చివరినాటికి ఎన్ఐఎం 3 శాతానికి దిగిరానున్నదన్నారు. ఉద్యోగులు మొండి బకాయిలపై ప్రత్యేక దృష్టి సారించడం వల్లనే లాభాల్లో భారీ వృద్ది నమోదైందన్నరు బ్యాంక్ క్యాపిటల్ అడెక్సీసి రేషియలో 14.91 శాతం నుంచి 16.24 శాతానికి దిగొచ్చాయని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో టైర్ 1, టైర్ 2, టైర్ 3 బాండ్లను విక్రయించడం ద్వారా రూ. 7,500 కోట్ల నిధులను సమీకరించాలని యోచిస్తున్నది.