న్యూఢిల్లీ, జనవరి 23: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను రూ.2,882 కోట్ల నికర లాభాన్ని గడించింది ప్రభుత్వరంగ సంస్థ కెనరా బ్యాంక్. వడ్డీల ద్వారా సమకూరే ఆదాయం పెరగడం, మొండి బకాయిలు తగ్గుముఖం పట్టడంతో అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.1,502 కోట్ల లాభంతో పోలిస్తే 92 శాతం ఎగబాకినట్టు వెల్లడించింది. సమీక్షకాలంలో బ్యాంక్ ఆదాయం రూ.21,312 కోట్ల నుంచి రూ.26,218 కోట్లకు పెరిగినట్టు తెలిపింది. గత త్రైమాసికానికిగాను వడ్డీల ద్వారా వచ్చే ఆదాయం రూ.22,231 కోట్లకు చేరుకోవడం వల్లనే లాభాల్లో భారీ వృద్ధి నమోదైందని బ్యాంక్ వర్గాలు వెల్లడించాయి. బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 5.89 శాతానికి తగ్గగా, నికర ఎన్పీఏ 2.86 శాతం నుంచి 1.96 శాతానికి దిగొచ్చాయి.