హైదరాబాద్, జూలై 2: ప్రభుత్వరంగ సంస్థ కెనరా బ్యాంక్ పసిడి రుణాల్లో రికార్డు సృష్టించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ చివరినాటికి దేశవ్యాప్తంగా లక్ష కోట్ల రూపాయలకు పైగా పసిడి రుణాలు ఇచ్చినట్లు తాజాగా వెల్లడించింది. అంతక్రితం ఏడాదితో పోలిస్తే గోల్డ్ రుణాల జారీలో 26.19 శాతం వృద్ధి నమోదైనట్లు బ్యాంక్ వర్గాలు వెల్లడించాయి. ఇటీవలకాలంలో దేశీయంగా పసిడి రుణాలు తీసుకునేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతుండటంతో ఇందుకోసం బ్యాంక్ 435 శాఖలను ఏర్పాటుచేసినట్లు బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ భావేంద్ర కుమార్ తెలిపారు. గరిష్ఠంగా రెండేండ్లలోపు తీసుకునే పసిడి రుణాలపై 7.4 శాతం నుంచి 7.65 శాతం వడ్డీని వసూలు చేస్తున్నట్లు చెప్పారు.