Campa Cola | అలనాటి సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్ కంపాను రిలయన్స్ తాజాగా రీ లాంచ్ చేసింది. ఇటీవలే ప్యూర్ డ్రింక్స్ గ్రూప్ నుంచి కంపా బ్రాండ్ను టేకోవర్ చేసింది. ఈ నేపథ్యంలో మార్కెట్లోకి కంపా కోలా, కంపా లెమన్, కంపా ఆరెంజ్ అనే పేర్లతో మూడు సాఫ్ట్ డ్రింక్స్ను గురువారం రిలయన్స్ కన్జూమర్ ప్రొడక్ట్స్ తీసుకొచ్చింది. వేసవిలో కూల్డ్రింక్స్కు గల గిరాకీని దృష్టిలో పెట్టుకుని రిలయన్స్.. ఈ కంపా డ్రింక్స్ను మార్కెట్లోకి తెచ్చినట్లు తెలుస్తున్నది. వీటి విక్రయాలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల నుంచి ప్రారంభిస్తున్నామని రిలయన్స్ వెల్లడించింది. కంపా కోలా, కంపా లెమన్, కంపా ఆరెంజ్ డ్రింక్స్ 200 మి.లీ, 500 మి.లీ, 600 మి.లీ, లీటర్, రెండు లీటర్ల బాటిళ్లలో వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయి. 200 మి.లీ. బాటిల్ పది రూపాయలకు లభించనుండగా, 500 మి.లీ బాటిల్ రూ.20గా రిలయన్స్ కన్జూమర్ ప్రొడక్ట్స్ నిర్ణయించింది.
1980వ దశకంలో కూల్డ్రింక్స్లో కంపా బ్రాండ్ హవా సాగింది. 1991లో సరళీకృత ఆర్థిక విధానాలు అమల్లోకి రావడంతో విదేశీ బ్రాండ్లు కోకాకోలా, పెప్సీ దేశీయ మార్కెట్లోకి ఎంటరయ్యాయి. క్రమేపీ కంపా బ్రాండ్ సాఫ్ట్ డ్రింక్స్ కనుమరుగయ్యాయి. కాగా, 2022 ఆగస్టులో ప్యూర్ డ్రింక్స్ గ్రూప్ నుంచి రూ.22 కోట్లకు కంపా బ్రాండ్ను రిలయన్స్ కొనుగోలు చేసింది. ఎఫ్ఎంసీజీ మార్కెట్లో అడుగు పెడుతున్నట్లు అంతకుముందే ప్రకటించింది రిలయన్స్. తర్వాత కొద్ది రోజులకే కంపా బ్రాండ్ను టేకోవర్ చేసింది. దేశవ్యాప్తంగా రిలయన్స్కు విస్తారమైన నెట్వర్క్తో కూడిన మార్కెట్ ఉన్నాయి. కంపా బ్రాండ్ సాఫ్ట్ డ్రింక్స్ను తిరిగి మార్కెట్లోకి తేవడంతో పెప్సీ, కోకాకోలాకు గట్టి పోటీ ఎదురు కానున్నదని విశ్లేషకులు భావిస్తున్నారు.
23 ఏండ్ల క్రితం భారత్లో కంపా సాఫ్ట్ డ్రింక్స్ సేల్స్ దేశంలో నిలిపేశారు. 1970, 1980వ దశకాల్లో ప్యూర్ డ్రింక్స్, కంపా బేవరేజెస్ ఆధ్వర్యంలో వచ్చిన కంపా కూల్ డ్రింక్స్దే దేశీయ మార్కెట్లో ఆధిపత్యం. జాతీయ వాదం థీమ్తో `ది గ్రేట్ ఇండియన్ టేస్ట్` అనే నినాదంతో కంపా కూల్ డ్రింక్స్ భారతీయులందరికీ చేరువయ్యాయి. తిరిగి కంపా కూల్ డ్రింక్స్ నూతన అవతార్లో అన్ని తరాల కస్టమర్లకు చేరువ కానున్నాయని రిలయన్స్ అధికార ప్రతినిధి వ్యాఖ్యానించారు. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ అనుబంధ సంస్థే రిలయన్స్ కన్జూమర్ ప్రొడక్ట్స్.