Byju’s | రుణాలు, వాటి వడ్డీ – వాయిదాల చెల్లింపులతో ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న ప్రముఖ ఎడ్ టెక్ స్టార్టప్ బైజూ’స్ తమ ఉద్యోగులకు జనవరి వేతనాలను చెల్లించింది. తాము ఎంతో శ్రమకోర్చి వేతనాలు చెల్లించామని బైజూ’స్ సీఈఓ బైజూ రవీంద్రన్ స్వయంగా తెలిపారు. కంపెనీ ఇన్వెస్టర్లు సృష్టించిన కృత్రిమ కొరత వల్లే ఆలస్యమైందని పేర్కొన్నారు.
‘సోమవారం కల్లా వేతనాలు అందుతాయని మీకు సమాచారం ఉందని నాకు తెలుసు. మీలో చాలా మంది నా పరిస్థితిని అర్ధం చేసుకుని మరికొంత కాలం వెయిట్ చేస్తామని లేఖ రాశారు. కానీ సోమవారం దాక వెయిట్ చేయనక్కరలేదు. కొన్ని నెలలుగా మీ వేతనాలు చెల్లించడానికి నేను పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా.. చట్టబద్ధ అర్హత పొందిన వేతనం మీకు అందించేందుకు ఈసారి మరింత పోరాడాల్సి వచ్చింది. ప్రతి ఒక్కరూ ఊహించని నిర్ణయాలతో త్యాగాలు చేశారే గానీ.. సంస్థను ఎవరూ వీడలేదు. మనపై మనకు ఉన్న నమ్మకమే దీనికి కారణం. ఆత్మగౌరవం ఉంటే అన్నీ ఉన్నట్లే’ అని ఉద్యోగులకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
ప్రతి నెలా సిబ్బంది వేతనాల చెల్లింపునకు బైజూ’స్ సుమారు రూ.70 కోట్లు ఖర్చు చేస్తున్నది. ఉద్యోగుల జనవరి వేతనాలను యాజమాన్యం ఆలస్యంగా చెల్లిస్తుందని ఇటీవల మీడియా కథనాలు వచ్చాయి. ఇక రవీంద్రన్ను బైజూ’స్ సీఈఓగా తొలగించేందుకు ఇన్వెస్టర్లంతా ఏకమయ్యారంటూ వచ్చిన వార్తలపై స్పందించిన యాజమాన్యం.. ఇన్వెస్టర్లకు ఆ హక్కు లేదని స్పష్టం చేసింది.