హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): అంతకంతకూ పెరుగుతున్న సైబర్ నేరాలపై అన్ని వ్యాపార సంస్థలు ఇప్పుడు గట్టిగానే దృష్టి పెడుతున్నాయి. ఈ క్రమంలోనే తమ కంపెనీ బడ్జెట్లో సైబర్ సెక్యురిటీ కోసం ప్రత్యేకంగా నిధులను కేటాయించాలని వ్యాపారులు యోచిస్తున్నారు. దేశంలోని 82 శాతం వ్యాపారులది ఇదే మాట అని సైబర్ సెక్యురిటీ సంస్థ పీడబ్ల్యూసీ ఇటీవల నిర్వహించిన గ్లోబల్ డిజిటల్ ట్రస్ట్ సర్వేలో వెల్లడైంది. ఇక ఈ ఏడాదితో పోల్చితే వచ్చే ఏడాది సైబర్ దాడుల ముప్పు పెరిగే అవకాశం ఉందని 65 శాతం మంది భావిస్తున్నారు. కాగా, ఈ సైబర్ దాడులు క్లౌడ్ బేస్డ్ పాథ్వేస్ ద్వారా 59 శాతం, ఇంటర్నెట్ వినియోగం కారణంగా 58 శాతం, మొబైల్ డివైజ్లు-సాఫ్ట్వేర్ ఇన్స్టలైజేషన్లతో 54 శాతం వరకు జరిగినట్టుగా స్పష్టమైంది. కాగా, గడిచిన 6 నెలల్లో దేశవ్యాప్తంగా 6.74 లక్షల సైబర్ దాడులు నమోదైనట్టు వెల్లడైంది.
కొత్తతరహా మోసాలు
గడిచిన రెండేండ్లలో దేశంలోని 95 శాతానికిపైగా సంస్థలు కొత్తతరహా మోసాల బారినపడ్డాయి. కరోనా నేపథ్యంలో డిజిటల్ సెక్యూరిటీ, ఉద్యోగ భద్రత, సమాచార లోపాలకు సంబంధించి నూతన సమస్యలు మొదలైనట్టు పీడబ్ల్యూసీ ‘గ్లోబల్ ఎకనామిక్ క్రైం అండ్ ఫ్రాడ్ సర్వే 2022’ నివేదిక తెలిపింది.