Market Capitalisation | అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు.. దేశీయంగా ఆటోమొబైల్ విక్రయాలు, జీఎస్టీ వసూళ్లలో గ్రోత్.. ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలోపేతమైంది. ఫలితంగా బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 555 పాయింట్ల లబ్ధితో 65,387 పాయింట్ల వద్ద.. ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 181 పాయింట్లు పుంజుకుని 19,400 మార్కును దాటేసింది. ఫలితంగా బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2.74 లక్షల కోట్లు పెరిగి రూ.312.33 లక్షల కోట్లకు దూసుకెళ్లింది. బీఎస్ఈలో 2183 స్టాక్స్ పుంజుకోగా, 1486 స్టాక్స్ పతనం అయ్యాయి. మరో 117 స్టాక్స్ స్థిరంగా కొనసాగాయి.
సర్వీస్ సెక్టార్లో గ్రోత్తో జూన్ త్రైమాసికం జీడీపీ నాలుగు త్రైమాసికాల గరిష్ట స్థాయికి దూసుకెళ్లి 7.8 శాతానికి చేరుకున్నది. గతేడాది జూన్ త్రైమాసికం జీడీపీ 13.1 శాతం, మార్చి త్రైమాసికం జీడీపీ 6.1 శాతంగా ఉంది. మరోవైపు ప్రముఖ రేటింగ్ సంస్థ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీసెస్ సైతం 2023లో జీడీపీ గ్రోత్ 5.5 శాతం నుంచి 6.7 శాతానికి పెరగవచ్చునని అంచనా వేసింది.
ఫెస్టివ్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆగస్టు వెహికల్స్ సేల్స్లో పలు సంస్థల సేల్స్ డబుల్ డిజిట్ నమోదు కావడం సానుకూల పరిణామంగా పేర్కొంటున్నారు. గత నెల కార్ల సేల్స్లో మారుతిసుజుకి ఆల్ టైం రికార్డు నెలకొల్పింది. మారుతి సుజుకితోపాటు మహీంద్రా అండ్ మహీంద్రా స్టాక్స్ 52 వారాల గరిష్ట స్థాయిని తాకాయి. చైనా విడుదల చేసిన సూక్ష్మ ఆర్థిక డేటా ప్రోత్సాహకరంగా ఉంది.