Budget 2022-23 | వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టే ముహూర్తం దగ్గర పడుతోంది. ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022-23ఆర్థిక సంవత్సర బడ్జెట్ను పార్లమెంట్కు సమర్పిస్తారు. ఈ నేపథ్యంలో బడ్జెట్లో రాయితీలపై అన్ని వర్గాల ప్రజానీకం ఆశగా ఎదురుచూస్తుంటారు. ప్రత్యేకించి, వేతన జీవులు, పెన్షనర్లు తమకు ఐటీ రిటర్న్స్లో స్టాండర్డ్ డిడక్షన్ శాతం పెంచాలని కోరుతున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో స్టాండర్డ్ డిడక్షన్ 30-35 శాతానికి పెంచాలని అభ్యర్థిస్తున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్కం టాక్స్ శ్లాబ్లు యధాతథంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం పన్ను చెల్లింపుదారులకు రూ.50 వేల వరకు స్టాండర్డ్ డిడక్షన్ ఆప్షన్ అందుబాటులో ఉంది. పారిశ్రామిక రంగంతో అనుబంధం కల వారు దీన్ని పెంచాలని కోరుతున్నారు. పర్సనల్ టాక్సేషన్పై పలు సలహాలు, సూచనలు వస్తున్నాయి. చాలా మంది స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి పెంచాలని అభ్యర్థిస్తున్నారు. కోవిడ్తో ఆరోగ్య సమస్యల వల్ల వైద్య ఖర్చులు పెరిగినందున స్టాండర్డ్ డిడక్షన్ 30-35 శాతానికి పెంచాలని డిమాండ్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
పన్ను చెల్లింపుదారులకు స్టాండర్డ్ డిడక్షన్ ఆప్షన్ పరిమితి పెంచే విషయమై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఓ అధికారి చెప్పారు. న్యూ టాక్స్ రిజిమ్లో స్టాండర్డ్ డిడక్షన్ ఆప్షనే లేదు. 2018లో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ డిడక్షన్ను రూ.40 వేలకు పెంచారు. 2019లో అప్పటి ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి రూ.50 వేలకు పొడిగించారు.
కరోనా వేళ ఇంటి ఖర్చులు పెరిగిపోయాయాని, ఎలక్ట్రిసిటీ, కమ్యూనికేషన్ ఖర్చులు పెరిగాయని వేతన జీవులు అంటున్నారు. ఈ నేపథ్యంలో కొంత రిలీఫ్ కల్పించాలని అభ్యర్థిస్తున్నారు. కనీసం స్టాండర్డ్ డిడక్షన్ 20-25 శాతం కల్పించాలని డెల్లాయిట్ పార్టనర్ సుధాకర్ సేథురామన్ కోరారు. వర్క్ ఫ్రం హోం వల్ల పలు దేశాలు పన్ను చెల్లింపుదారులకు టాక్స్ మినహాయింపు ఇస్తున్నాయని గుర్తు చేశారు.
అసోచామ్, సీఐఐ కూడా స్టాండర్డ్ డిడక్షన్ పరిధి పెంచాలని కోరుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి చాలా తక్కువగా ఉందని, దీన్ని రూ.75 వేలకు పెంచాలని కోరాయి. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా దీని పరిమిది పెంచాలని కోరుతున్నాయి. క్యాపిటల్ గెయిన్స్ మీద కాంపౌండింగ్ పన్ను విషయంలో కేంద్రం ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నది.