Mobiles Cheap | విదేశాల నుంచి దిగుమతి చేసుకునే కొన్ని రకాల వస్తువులు మరింత ప్రియం కానున్నాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే గొడుగులపై దిగుమతి సుంకం పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు. అయితే మొబైల్ ఫోన్లు, మొబైల్ ఫోన్ల చార్జర్లు తగ్గనున్నాయి.
ఇక దుస్తులు, జెమ్ స్టోన్స్, డైమండ్స్, ఇమిటేషన్ జ్యువెల్లరీ, పెట్రోలియం ఉత్పత్తుల్లో వినియోగించే రసాయనాలపైన, స్టీల్ స్క్రాప్పైనా సుంకాలు తగ్గుతాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే యంత్రాలు, ఫార్మింగ్ గూడ్స్ ధరలు తగ్గనున్నాయి. కోఆపరేటివ్ సర్ చార్జీ 12 నుంచి ఏడు శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వృద్ధిరేటు 9.2 శాతానికి చేరుతుందని అంచనా వేస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రపంచంలోని సంపన్న దేశాల వృద్ధిరేటు కంటే ఎక్కువగా ఉంటుందన్నారు. తిరిగి ఆర్థిక వ్యవస్థ వృద్ధి దిశగా పుంజుకున్నదని ఆమె చెప్పారు. ఎకానమీ బలోపేతానికి పలు చర్యలు తీసుకున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ డిజిటల్ కరెన్సీ విడుదల చేస్తుందని పేర్కొన్నారు. ఇక క్రిప్టో కరెన్సీ లావాదేవీలపై వచ్చే ఆదాయం మీద 30 శాతం పన్ను విధిస్తామని వెల్లడించారు.
ఇక ఆదాయం పన్ను శ్లాబ్ల్లో ఎటువంటి మార్పులు చేయకుండానే నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగాన్ని ముగించారు. ఏడేండ్లుగా కేంద్రంలోని మోదీ సర్కార్.. ఆదాయం పన్ను శ్లాబ్లను యథాతథంగా కొనసాగిస్తున్నది. రెండేండ్లలోపు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడం ఒక్కటే వేతన జీవులకు లభించే ఊరట.
నిర్మలా సీతారామన్ తన నాలుగో వార్షిక బడ్జెట్ను 92 నిమిషాల్లో ముగించారు. 2019-20 నుంచి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగాల్లో ఇదే చిన్నది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా 2.40 గంటల సేపు బడ్జెట్ ప్రసంగం చేసి రికార్డు నెలకొల్పారు.
గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ‘యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్’లో బడ్జెట్ ప్రతులు అందుబాటులో ఉంటాయి. పార్లమెంట్ సభ్యులు, సాధారణ ప్రజానీకానికి తేలిగ్గా అందుబాటులోకి వచ్చేలా 2021-22 ఆర్థిక సంవత్సర బడ్జెట్ సమయంలో ఈ యాప్ తీసుకొచ్చారు.