న్యూఢిల్లీ, నవంబర్ 14: నరేంద్ర మోదీ సర్కారు ఏ ప్రభుత్వరంగ సంస్థను వదలడం లేదు. ఇప్పటికే ఎల్ఐసీతోపాటు ఇతర ప్రభుత్వరంగ సంస్థలకు చెందిన ఆస్తులను విక్రయించిన కేంద్రం.. తాజాగా టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్కు చెందిన ఆస్తులపై పడింది. సంస్థకు చెందిన ఆస్తుల విక్రయానికి సంబంధించి బిడ్డింగ్లను ఆహ్వానించారు. తెలంగాణతోపాటు నాలుగు రాష్ర్టాల్లో సంస్థకు ఉన్న ఆస్తులను వేలం వేయనున్నట్లు ప్రకటించింది.
తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్లలో ఉన్న 13 ఆస్తుల విక్రయానికి సంబంధించి వచ్చే నెల 5 నుంచి బిడ్డింగ్లను ఆహ్వానిస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఆన్లైన్ పోర్టల్ ఎంఎస్టీసీతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న బీఎస్ఎన్ఎల్కు చెందిన ఈ 13 ఆస్తుల విలువ రూ.20,160 కోట్లుగా ఉంటుందని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్(దీపం) అందచేసిన నివేదికలో వెల్లడించింది. ఆస్తుల నగదీకరణలో భాగంగా దీపం ఈ జాబితాను రూపొందించింది.
ఆదుకుంటామంటూనే..
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన సంస్థను ఆర్థికంగా ఆదుకుంటామంటునే..మరోవైపు ఆస్తుల విక్రయాన్ని వేగవంతం చేసింది నరేంద్ర మోదీ సర్కార్. రెండేండ్ల క్రితం బీఎస్ఎన్ఎల్తోపాటు ఎంటీఎన్ఎల్ను ఆదుకోవడానికి రూ 69 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఒకవైపు సంస్థను అన్ని రకాలుగా ఆదుకుంటామంటూనే..మరోవైపు ఆస్తుల విక్రయానికి సంబంధించి బిడ్డింగ్లను ఆహ్వానించడం గమనార్హం.
అలాగే ఉద్యోగులకు స్వచ్చంధ పదవీ విరమణ పథకం(వీఆర్ఎస్) ప్రకటించింది. దీంతో ఈ పథకాన్ని చాలా మంది ఎంచుకున్నారు కూడా. ఆస్తుల నగదీకరణలో భాగంగా దేశవ్యాప్తంగా కంపెనీకి ఉన్న భూములు, భవనాలను అమ్మకానికి పెట్టింది. ఇలా వచ్చిన నిధులను టెలికం నెట్వర్క్ను విస్తరించడానికి వినియోగించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. తొలి విడుత 13 ఆస్తులను గుర్తించడం జరిగిందని, త్వరలో మరిన్ని ఆస్తులను విక్రయించనున్నట్లు ప్రకటించింది.
ఎక్కడెక్కడ అమ్ముతున్నారంటే?