న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: ఒకవైపు మొబైల్ రీచార్జ్ ధరలు పెరుగుతూ, మరోవైపు ఆయా ప్లాన్ల కాలపరిమితులు తగ్గుతున్న నేపథ్యంలో వినియోగదారులకు ఊరటనిస్తూ బీఎస్ఎన్ఎల్ ఒక కొత్త ప్లాన్ను ప్రవేశపెట్టింది. రూ.197 ప్రిపెయిడ్ రీచార్జ్తో 2జీబీ రోజువారీ హైస్పీడ్ డాటాను ఇచ్చే ఈ ప్లాన్ వ్యాలిడిటీ 150 రోజులుంటుంది. బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్లో డాటాతో పాటు ఉచిత అన్లిమిటెడ్ కాల్స్, ఉచిత ఎస్ఎంఎస్ మెసేజ్ల సదుపాయం ఉంటుంది. ఈ సదుపాయాలతో ఇప్పుడు దేశంలో టెలికం కంపెనీలు అందిస్తున్న ప్రిపెయిడ్ రీచార్జ్ల్లో ఇదే చౌకైనది. అయితే ఈ ప్లాన్కు కొన్ని పరిమితులు ఉన్నాయి. రీచార్జ్ చేసుకున్న తర్వాత తొలి 18 రోజులు హైస్పీడ్ డాటా, అన్లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి. అటుతర్వాత మిగిలిన 132 రోజులకు డాటా స్పీడ్ 40కేబీపీఎస్ మేర తగ్గుతుంది. యూజర్లు ఇన్కమింగ్ కాల్స్ స్వీకరించగలుగుతారు కానీ, అవుట్గోయింగ్ కాల్స్ కోసం అవసరానికి తగ్గ టాప్అప్ను వేసుకోవాల్సి ఉంటుంది. 150 రోజుల కాలపరిమితి మొత్తం ఉచిత ఎస్ఎంఎస్ మెసేజ్ల సదుపాయం కొనసాగుతుంది. కస్టమర్ల కోసం బీఎస్ఎన్ఎల్ ప్రిపెయిడ్ రీచార్జ్ వెబ్సైట్లలో ఈ ప్లాన్ను లిస్ట్ చేసింది.