న్యూఢిల్లీ, డిసెంబర్ 8: వచ్చే 5-7 నెలల్లో బీఎస్ఎన్ఎల్ 4జీ టెక్నాలజీ.. 5జీకి అప్గ్రేడ్ అవుతుందని కేంద్ర టెలికం, రైల్వే శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. గురువారం జరిగిన సీఐఐ కార్యక్రమంలో మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 1.35 లక్షల బీఎస్ఎన్ఎల్ టవర్లను 5జీ టెక్నాలజీలోకి మారుస్తామని చెప్పారు. నిజానికి దేశంలో మరే ఇతర టెలికం సంస్థలకు గ్రామీణ ప్రాంతాల్లో లేని విస్తృతమైన నెట్వర్క్ ప్రభుత్వ రంగ టెలికం సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్కు ఉందన్న మంత్రి.. భారతీయ టెలికం రంగంలో బీఎస్ఎన్ఎల్ పాత్ర బలంగా, స్థిరమైనదిగానే ఉంటుందని కొటక్ బ్యాంక్ సీఈవో ఉదయ్ కొటక్ వేసిన ఓ ప్రశ్నకు సమాధానంగా స్పష్టం చేశారు.
రూ.4వేల కోట్లతో నిధి
దేశీయ ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి టెలికం టెక్నాలజీ డెవలప్మెంట్ వార్షిక ఫండ్ను రూ.500 కోట్ల నుంచి రూ.3,000-4,000 కోట్లకు పెంచే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు ఈ సందర్భంగా మంత్రి వైష్ణవ్ సంకేతాలిచ్చారు. ఈ నిధి యావత్తు భారతీయ టెలికం పరిశ్రమకు అందుబాటులో ఉంటుందని చెప్పారు. కాగా, 5జీ టెస్టింగ్కు అవసరమైన ఎక్విప్మెంట్ కోసం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)ను బీఎస్ఎన్ఎల్ అడిగిందని, కాబట్టి సాధ్యమైనంత త్వరలోనే దేశంలో బీఎస్ఎన్ఎల్ 5జీ సేవలు మొదలవుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.