ముంబై, ఏప్రిల్ 18: వరుస లాభాలతో రికార్డుల్ని సృష్టించిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ఇప్పుడు వరుస నష్టాలతో అల్లాడిపోతున్నాయి. నాలుగు రోజులుగా సూచీలు పతనం దిశగానే అడుగులు వేస్తుండటంతో లక్షల కోట్ల రూపాయల్లో మదుపరుల సంపద ఆవిరైపోయింది. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ)లో నమోదైన సంస్థల మార్కెట్ విలువ గత నాలుగు ట్రేడింగ్ సెషన్లలో రూ.9,30,304.76 కోట్లు హరించుకుపోయింది. అంతకుముందు రూ.400 లక్షల కోట్లకుపైనే ఉండటం గమనార్హం. కానీ ఇప్పుడు రూ.3,92,89,048.31 కోట్లుగానే ఉన్నది. హెవీ వెయిట్ షేర్లతోపాటు మిడ్, స్మాల్క్యాప్ సూచీల్లోని షేర్లూ అమ్మకాల ఒత్తిడికి లోనవుతుండటంతో మార్కెట్లు నిలబడలేకపోతున్నాయి. ఈ క్రమంలోనే ఆయా సంస్థల మార్కెట్ విలువ కూడా అంతకంతకూ దిగజారిపోతున్నది.
తీవ్ర ఒడిదొడుకులు
మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతుండటంతో సూచీలు వరుస నష్టాలకు లోనవుతున్నాయి. గురువారం బీఎస్ఈ సూచీ సెన్సెక్స్ 454.69 పాయింట్లు లేదా 0.62 శాతం పడిపోయి 72,488.99 వద్ద స్థిరపడింది. ఒకానొక దశలో 1,107.38 పాయింట్లు కోల్పోవడం గమనార్హం. కాగా, మధ్యాహ్నం వేళ ఇన్వెస్టర్లు ఒక్కసారిగా పెట్టుబడుల ఉపసంహరణకు దిగారు. దీంతో కేవలం 3 నిమిషాల్లోనే సెన్సెక్స్ ఏకంగా 319 పాయింట్లు దిగజారింది. 1:31 నిమిషాలకు 73,135.50 వద్ద ఉన్న సెన్సెక్స్.. 1:34 నిమిషాలకు 72,817.03 వద్దకు పడింది. మార్కెట్లో నెలకొన్న హెవీ సెల్లింగ్ ప్రెషర్కు ఇది అద్దం పడుతున్నది. ఇక నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ కూడా 152.05 పాయింట్లు లేదా 0.69 శాతం క్షీణించి 22 వేల స్థాయికి దిగువన 21,995.85 వద్ద నిలిచింది. ట్రేడింగ్ సమయంలో గరిష్ఠ స్థాయి 22,326.50, కనిష్ఠ స్థాయి 21,961.70 మధ్య సూచీ ఊగిసలాడటం.. తీవ్ర ఒడిదొడుకులకు నిదర్శనంగా నిలుస్తున్నది.
నెస్లే షేర్లు ఢమాల్
నెస్లే షేర్లు భారీ నష్టాలను చవిచూశాయి. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చిన్నారుల కోసం నెస్లే అమ్ముతున్న పాల ఉత్పత్తుల్లో చక్కెర స్థాయిలు మోతాదుకు మించి ఉన్నాయన్న వార్తలతో ఒక్కసారిగా అలజడి చెలరేగింది. ఈ నేపథ్యంలోనే ఒక్కరోజే 3 శాతానికిపైగా నెస్లే షేర్ విలువ క్షీణించింది. ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున షేర్లను వదిలించుకునే దిశగా వెళ్లారు. ఫలితంగా సంస్థ మార్కెట్ విలువ రూ.8,137.49 కోట్లు తగ్గి రూ.2,37,447.80 కోట్లకు పరిమితమైంది. బీఎస్ఈలో 3.31 శాతం దిగజారి రూ.2,462.75 వద్ద ముగిసింది. ఒకానొక దశలో 5.40 శాతం పడిపోవడం గమనార్హం. అటు ఎన్ఎస్ఈలోనూ 2.94 శాతం పతనమై రూ.2,471 వద్ద ఉన్నది. అయితే గత ఐదేండ్లలో తమ బేబీ ఫుడ్ ఉత్పత్తుల్లో యాడెడ్ షుగర్స్ను 30 శాతం మేర తగ్గించామని నెస్లే ఇండియా చెప్తున్నది. ఇదిలావుంటే బ్యాంకింగ్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, చమురు-గ్యాస్, ఆటో, రియల్టీ, కమోడిటీస్ షేర్లలో సెల్లింగ్ ప్రెషర్ బాగా కనిపించింది. బీఎస్ఈ మిడ్, స్మాల్క్యాప్ సూచీలూ 0.39 శాతం, 0.06 శాతం చొప్పున నష్టపోయాయి.
వరుస నష్టాలకు కారణాలు