ముంబై, డిసెంబర్ 13: బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ)లో నమోదిత మదుపరి ఖాతాలు 12 కోట్లకు చేరాయి. గత 148 రోజుల్లో కొత్తగా కోటి మదుపరులు వచ్చినట్టు మంగళవారం ఓ ప్రకటనలో ఈ ప్రముఖ స్టాక్ ఎక్సేంజ్ తెలిపింది. ఈ ఏడాది జూలై 18 నుంచి డిసెంబర్ 13 వరకు మరో కోటి మదుపరి ఖాతాలు నమోదైనట్టు బీఎస్ఈ పేర్కొన్నది. కాగా, అంతకుముందు 124 రోజుల్లో కోటి మదుపరులను అందుకుని బీఎస్ఈ 11 కోట్ల మైలురాయిని చేరింది. అలాగే 91 రోజుల్లో కోటి ఇన్వెస్టర్లతో 10 కోట్ల రికార్డును సాధించింది. ఇక 85 రోజుల్లోనే కోటి మంది కొత్తవారితో 9 కోట్లను, 107 రోజుల్లో మరో కోటి మందితో 8 కోట్ల స్థాయిని బీఎస్ఈ అందుకున్నది. 1875లో మొదలైన బీఎస్ఈ.. ప్రపంచంలోనే ప్రాచీన స్టాక్ ఎక్సేంజీల్లో 10వ స్థానంలో ఉన్నది. అలాగే 6 మైక్రోసెకండ్ల స్పీడ్తో ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన స్టాక్ ఎక్సేంజీగా కొనసాగుతున్నది.