లండన్: బ్రిటన్లో స్టీల్ గ్రూపును నడిపిస్తున్న భారతీయ సంతతి వ్యాపారవేత్త సంజీవ్ గుప్తాకు ఆ దేశం మొండి చేయి చూపించింది. దివాళా దశలో ఉన్న గుప్తా ఫ్యామిలీ గ్రూపును ఆదుకునేందుకు బ్రిటన్ ప్రభుత్వం ఆసక్తి చూపలేదు. ఆ గ్రూపుకు 170 మిలియన్ పౌండ్ల ఆర్థిక సాయాన్ని అందించేందుకు బోరిస్ జాన్సన్ ప్రభుత్వం సుముఖంగా లేదని బ్రిటన్ వాణిజ్యశాఖ మంత్రి తెలిపారు. సంజీవ్ గుప్తా స్టీల్ గ్రూపు నిర్వహణ తీరు పారదర్శకంగా లేదని బ్రిటన్ అభిప్రాయపడింది. గుప్తా స్టీల్ సంస్థ జాతీయ సంపదే అని, బ్రిటన్లో మూడు వేల మంది కంపెనీ ఉద్యోగులు ఉన్నారని, కానీ ఆ బ్లాక్ బాక్సులోకి నిధులను మళ్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని మంత్రి పేర్కొన్నారు. పన్నుదారుల నుంచి వచ్చిన ఆదాయానికి మేం పూచీకత్తు తీసుకుంటున్నామని, 235 మిలియన్ల డాలర్లు ఆ గ్రూపుకు ఇవ్వలేమని, ఎందుకంటే ఆ డబ్బు బ్రిటన్లో ఉంటుందన్న నమ్మకం లేదని, బ్రిటన్ ఉద్యోగాలను రక్షిస్తారన్న విశ్వాసం లేదని వాణిజ్య మంత్రి తెలిపారు. అయినా ఆ కంపెనీని ఆదుకునేందుకు మరికొన్ని మార్గాలను అన్వేషిస్తున్నట్లు ఆయన చెప్పారు. గుప్తా ఫ్యామిలీ గ్రూపు, లిబర్టీ స్టీల్ కంపెనీల భవిష్యత్తుపై బ్రిటన్లో ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.