హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): ప్రపంచంలోని అతిపెద్ద బయోఫార్మాస్యూటికల్ కంపెనీల్లో ఒకటైన బ్రిస్టల్ మైయర్స్ స్కిబ్.. హైదరాబాద్లో తమ నూతన ఐటీ, డ్రగ్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించింది. దాదాపు రూ.830 కోట్ల (100 మిలియన్ డాలర్లు) పెట్టుబడితో ఈ ఇన్నోవేషన్ హబ్ను నెలకొల్పింది. ఇందులో కొత్తగా 1,500 మందికి ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్టు సంస్థ ప్రకటించింది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, కంపెనీ సీఈవో క్రిస్టోఫర్ బార్నర్, సీటీవో గ్రెగ్ మేయర్స్ కలిసి ఈ కేంద్రాన్ని ఆవిష్కరించినట్టు సోమవారం బ్రిస్టల్ మైయర్స్ స్కిబ్ తెలియజేసింది. ఇక్కడ ఔషధాల అభివృద్ధితోపాటు ఐటీ, డిజిటల్ సామర్థ్యాలను విస్తరించనున్నట్టు వివరించింది. హైదరాబాద్లో బ్రిస్టల్ మైయర్స్ స్కిబ్ కొత్త ఫెసిలిటీ ప్రారంభం కావడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. దీన్ని రాష్ట్ర ఔషధ, డిజిటల్ రంగాల్లో ఓ మైలురాయిగా అభివర్ణించిన ఆయన ఇందుకుగాను కంపెనీకి ధన్యవాదాలు తెలిపారు.
సైన్స్ అండ్ ఇన్నోవేషన్ రంగాల్లో స్థానిక ప్రతిభావంతులకు పనిచేసే అవకాశం లభిస్తుందన్నారు. తెలంగాణలో ఐటీ, డిజిటల్ రంగాల్లో ప్రతిభావంతులకు కొదవే లేదని చెప్పారు. రాష్ట్రంలో ఈ రంగాల అభివృద్ధికి బ్రిస్టల్ మైయర్స్ సహకారం అందించాలని కోరారు. కంపెనీ సీఈవో క్రిస్టోఫర్ బార్నర్ మాట్లాడుతూ.. ఈ కొత్త ఇన్నోవేషన్ హబ్.. ఔషధాల అభివృద్ధిని వేగవంతం చేయడంతోపాటు డిజిటల్ సామర్థ్యాలను మరింత మెరుగుపరుస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారానికి కృతజ్ఞతలు చెప్పారు. భారత్లో తమ కంపెనీ విస్తరణకు, స్థానిక ప్రతిభావంతులతో కలిసి పనిచేసేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. ఇక క్యాన్సర్ చికిత్సకు ఔషధాల తయారీతోపాటు సెల్ థెరపీ, హెమటాలజీ, ఇమ్యునాలజీ, కార్డియోవాస్క్యులర్ తదితర వ్యాధుల నయానికి ఆధునిక సాంకేతిక విధానాలను అభివృద్ధి చేస్తున్నామని వివరించారు.
అంతర్జాతీయ హెల్త్కేర్ ఇంజినీరింగ్ సేవల సంస్థ ప్రొవిడెన్స్ ఇండియా.. తాజాగా హైదరాబాద్లో నూతన కార్యాలయాన్ని ప్రారంభించింది. 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ కార్యాలయాన్ని రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ప్రారంభించారు. అంతర్జాతీయ ఇన్నోవేషన్ సెంటర్గా తీర్చిదిద్దిన హైదరాబాద్ కార్యాలయంలో ప్రత్యేకంగా కృత్రిమ మేధస్సు, డాటా డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ హెల్త్కేర్ సేవలు అందిస్తున్నది. దేశవ్యాప్తంగా ఉద్యోగుల సంఖ్యను వచ్చే ఏడాది చివరినాటికి 3,500కి పెంచుకోనున్నట్లు ప్రకటించింది. 2020లో దేశీయ మారెటట్లోకి అడుగుపెట్టిన సంస్థలో ప్రస్తుతం 1,400 మంది సిబ్బంది విధిస్తున్నారు.