హైదరాబాద్, సెప్టెంబర్ 2: పతంజలి గ్రూప్ నేపాల్ సబ్సిడరీ పతంజలి ఆయుర్వేద ప్రైవేట్ లిమిటెడ్, ఆ దేశంలోని ఎవరెస్ట్ బ్యాంక్ (ఈబీఎల్)తో కలసి కో బ్రాండెడ్ వీసా కాంటాక్ట్లెస్ క్రెడిట్ కార్డుల్ని ఆవిష్కరించింది. పండుగ సీజన్ సందర్భంగా ఆకర్షణీయమైన ప్రయోజనాలతో వీటిని జారీచేస్తున్నామని, క్యాష్బ్యాక్స్, ఇన్సూరెన్స్ కవర్ లభిస్తాయని పతంజలి విడుదల చేసిన ప్రకటన తెలిపింది. తొలి మూడు నెలల్లో కార్డు జారీ ఫీజులో ఈబీఎల్ 50 శాతం డిస్కౌంట్ అందిస్తున్నదని, క్యాష్ అడ్వాన్స్, ఆటోడెబిట్ సదుపాయాలు, 14-45 రోజుల మధ్య జరిపే కొనుగోళ్లపై వడ్డీ ఉండదని తెలిపింది. పతంజలి ఉత్పత్తుల కొనుగోళ్లపై కస్టమర్లకు రివార్డులు లభిస్తాయని పతంజలి ఆయుర్వేద లిమిటెడ్ ఎండీ ఆచార్య బాలకృష్ణ తెలిపారు.
అరుణాచల్లో పామాయిల్ ప్లాంట్
అరుణాచల్ ప్రదేశ్లోని నిగ్లోక్ ఇండస్ట్రియల్ గ్రోత్ సెంటర్లో పతంజలి ఫుడ్స్ (గతంలో రుచిసోయా) ఒక పామాయిల్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నది. ఈ ప్లాంట్ నిర్మాణానికి తాజాగా శంకుస్థాపన చేసినట్టు పతంజలి ఫుడ్స్ తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్లోని 9 జిల్లాల్లో 38,000 హెక్టార్లలో పామాయిల్ తోటల పెంపకాన్ని చేపట్టామని, ఇందుకోసం ఇప్పటికే రెండు నర్సరీలను నెలకొల్పామని, మరో మూడింటిని ఏర్పాటు చేస్తున్నామని పతంజలి వివరించింది.