న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27: ఒక వైపు ప్రైవేటీకరణ జరుగుతున్నప్పటికీ మరో వైపు భారీ పెట్టుబడులకు సిద్ధమైంది దేశంలో రెండో అతిపెద్ద ఇంధన విక్రయ సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్(బీపీసీఎల్). వచ్చే ఐదేండ్లలో పెట్రోకెమికల్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంతోపాటు గ్యాస్, క్లీన్ ఫ్యూయల్తోపాటు మౌలిక రంగంలో మార్కెటింగ్ పరిస్థితులను మెరుగుపరుచడానికి వచ్చే ఐదేండ్లకాలంలో లక్ష కోట్ల రూపాయల మేర పెట్టుబడి పెట్టనున్నట్లు కంపెనీ చైర్మన్ అరున్ కుమార్ సింగ్ వెల్లడించారు. దేశంలో రెండో అతిపెద్ద ఇంధన విక్రయ సంస్థయైన బీపీసీఎల్..1000 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ను ఉత్పత్తి చేయాలని నిర్ణయించినట్లు, వీటిలో అత్యధికంగా కొనుగోళ్లు జరుపనుండగా, వీటితోపాటు బయోఫ్యూయల్, హైడ్రోజన్ రంగాల్లోనూ పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించినట్లు విలేకరులతో అన్నారు. మరోవైపు, దేశవ్యాప్తంగా ఉన్న 19 వేల పెట్రోల్ బంకుల్లో 7 వేల పెట్రోల్ పంపుల్లో ఏనర్జీ స్టేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కొత్తగా పెడుతున్న పెట్టుబడుల్లో పెట్రోకెమికల్స్ కెపాసిటీ పెంచుకోవడానికి, శుద్ధి సామర్థ్యాలు పెంచడానికి రూ.30 వేల కోట్లు, గ్యాస్ కోసం మరో రూ.20 వేల కోట్లు, చమురును ఉత్పత్తి చేయడానికి రూ.18 వేల కోట్లు, మార్కెటింగ్ మౌలిక సదుపాయాల విస్తరణకోసం రూ.18 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నది. వీటితోపాటు పునరుత్పాదక కోసం రూ.5 వేల కోట్లు, బయోఫ్యూయల్ కోసం రూ.7 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నది సంస్థ. ప్రస్తుతం సంస్థకు ముంబై, కొచ్చి, బినా మధ్యప్రదేశ్లలో మూడు చమురు రిఫైనరీ క్షేత్రాలు ఉన్నాయి.