400 లక్షల కోట్లపైకి..
బీఎస్ఈ నమోదిత సంస్థల మార్కెట్ విలువ తొలిసారి రూ.400 లక్షల కోట్ల ఎగువన ముగిసింది. గత ఏడాది జూలైలో రూ.300 లక్షల కోట్ల మార్కును తాకిన విషయం తెలిసిందే. కేవలం 9 నెలల్లోనే మదుపరుల సంపద రూ.100 లక్షల కోట్లు ఎగబాకడం గమనార్హం. సుమారు తొమ్మిదిన్నరేండ్ల క్రితం మొదటిసారి రూ.100 లక్షల కోట్ల మార్కును దాటిం ది. ఆ తర్వాత ఆరేండ్లకు రూ. 200 లక్షల కోట్లను చేరింది. అయితే రూ.200 లక్షల కోట్ల నుంచి రూ.300 లక్షల కోట్లను చేరడానికి రమారమీ రెండున్నరేండ్లే పట్టింది.
ముంబై, ఏప్రిల్ 8: హాట్.. హాట్ సమ్మర్ను దేశీయ స్టాక్ మార్కెట్లు రికార్డు గరిష్ఠాలతో మరింత హీటెక్కించాయి. సోమవారం అటు బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్, ఇటు నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ సరికొత్త స్థాయిలను అధిరోహించాయి. మదుపరులు పెట్టుబడులకు పెద్దపీట వేయడంతో ఉదయం ఆరంభం నుంచే రికార్డుల మోత మోగిం ది. ఈ క్రమంలోనే గత ఇంట్రా-డే హై, క్లోజింగ్ హై రికార్డులు బద్దలై కొత్తవి నమోదయ్యాయి. సెన్సెక్స్ ఒకానొక దశలో 621.08 పాయింట్లు ఎగిసి తొలిసారి 74,869.30 స్థాయిని తాకింది. ఇదే సమయంలో నిఫ్టీ కూడా 183.60 పాయింట్లు ఎగబాకి మొదటిసారి 22,697.30 స్థాయిని చేరింది. రెండు సూచీలకూ ఇవే ఆల్టైమ్ ఇంట్రా-డే హై. కానీ ఆఖర్లో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో ఈ ఉత్సాహం కాస్త చల్లబడింది. అయినప్పటికీ ఆల్టైమ్ క్లోజింగ్ హైల్లోనే సూచీలు స్థిరపడ్డాయి.
సెన్సెక్స్ 494.28 పాయింట్లు లేదా 0.67 శాతం ఎగబాకి మునుపెన్నడూ లేనివిధంగా 74,742.50 వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం 152.60 పాయింట్లు లేదా 0.68 శాతం పుంజుకొని గతంలో ఎప్పుడూ లేనట్టుగా 22,666.30 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, విదేశీ పెట్టుబడుల ప్రవాహం కలిసొచ్చాయని నిపుణులు ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నారు. ఇక హెవీ వెయిట్ షేర్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్కు కొనుగోలుదారుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. అలాగే మారుతీ సుజుకీ, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎన్టీపీసీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎల్అండ్టీ, యాక్సిస్ బ్యాంక్, పవర్ గ్రిడ్ షేర్లు మెరిశాయి. బీఎస్ఈ మిడ్క్యాప్ 0.26 శాతం, స్మాల్క్యాప్ 0.06 శాతం పెరిగాయి. రంగాలవారీగా ఆటో, ఆయిల్-గ్యాస్, ఎనర్జీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, రియల్టీ, మెటల్, యుటిలిటీస్ షేర్లు 1.65 శాతం నుంచి 0.90 శాతం మేర పెరిగాయి.
ప్రధాన ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా, జపాన్, హాంకాంగ్ సూచీలు లాభాల్లో ముగిశాయి. చైనా మాత్రం నష్టపోయింది. ఐరోపా మార్కెట్లలోనూ కీలక సూచీలైన జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్ లాభాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఇక అమెరికా స్టాక్ మార్కెట్లు గత వారాన్ని లాభాలతో ముగించిన విషయం తెలిసిందే. కాగా, విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్ఐఐ) శుక్రవారం రూ.1,659. 27 కోట్ల పెట్టుబడుల్ని భారతీయ ఈక్విటీ మార్కెట్లలోకి తీసుకొచ్చారు.
ఇంట్రా-డే హై సెన్సెక్స్74,869.30
నిఫ్టీ 22,697.30
క్లోజింగ్ హై సెన్సెక్స్74,742.50
నిఫ్టీ 22,666.30
ఆల్టైమ్ హైకి మార్కెట్ విలువ (కోట్లలో) 4,00,86,722.74