Boeing-Air India | ప్రముఖ అమెరికా విమానాల తయారీ సంస్థ బోయింగ్కు చెందిన విమానాల కోసం టాటా సన్స్ ఆధ్వర్యంలోని ఎయిర్ ఇండియా సుమారు 200 విమానాలకు అర్డర్ పెట్టనున్నదని సమాచారం. ఈ విషయమై రెండు వైపులా చురుగ్గా చర్చలు జరుగుతున్నాయని తెలుస్తున్నది. బోయింగ్ 737 మాక్స్ జెట్ విమానాలను `మహారాజా` కొనుగోలు చేయనున్నది తెలుస్తున్నది. ఇయర్ ఎండ్ హాలీడేస్ పూర్తయ్యేలోగా బోయింగ్, ఎయిరిండియా మధ్య చర్చల ప్రక్రియ ముగింపుకు చేరుతుందని తెలియవచ్చింది.
తుది ఒప్పందంలో 40 నుంచి 50 మాక్స్ ఎయిర్ క్రాఫ్ట్లు కూడా జత కలిసే అవకాశాలు లేకపోలేదు. చైనా విమాన యాన సంస్థల కోసం బోయింగ్ ఈ విమానాలను నిర్మించింది. కానీ అమెరికా- చైనా మధ్య నెలకొన్న వాణిజ్య పరమైన ఆంక్షలు, ఉద్రిక్తతల కారణంగా బోయింగ్.. సదరు డ్రాగన్ ఎయిర్లైన్స్కు డెలివరీ చేయలేదని ఆ సంస్థ వర్గాల కథనం. ఇక బోయింగ్, ఎయిరిండియా మధ్య విమానాల కొనుగోలు ఒప్పందంలో మార్పులపై ఇరు వర్గాలు చర్చల్లో నిమగ్నం అయ్యాయని తెలుస్తున్నది.
ఎయిరిండియాతో విమానాల కొనుగోలు ఒప్పందంపై స్పందించడానికి బోయింగ్ అధికార ప్రతినిధి నిరాకరించారు. టాటా సన్స్ ఎయిరిండియా ప్రతినిధులు స్పందించేందుకు అందుబాటులోకి రాలేదు. అంతర్జాతీయ రూట్లలో బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ జెట్ విమానాలు, ఎయిర్ బస్ ఎస్ఈ ఏ350 విమానాల కొనుగోలుపై మహారాజా దృష్టి సారించింది. బోయింగ్ 777 విమానాలను లీజ్కు తీసుకునే యోచనలో ఎయిరిండియా ఉన్నట్లు సమాచారం.
బోయింగ్ విమానాల కొనుగోలు ప్రక్రియలో ఫైనాన్సియర్లు ఇంజిన్ తయారీ దారులు చర్చల్లో పాల్గొంటున్నరు. వచ్చే ఏడాది దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం దేశీయంగా విమాన సర్వీసుల్లో ఆధిపత్యం ప్రదర్శిస్తున్న ఇండిగో అత్యధికంగా ఎయిర్ బస్ ఏ320 నియో ఫ్యామిలీ జెట్ విమానాలకు బెస్ట్ కస్టమర్గా నిలిచింది. మరోవైపు నాలుగు విమానయాన సంస్థలు గల టాటా సన్స్.. విస్తారా. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ లిమిటెడ్, ఎయిర్ ఏషియా ఇండియా సంస్థలను ఎయిరిండియా ఛత్రం కిందకు తేవడానికి ఆయా సంస్థల ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నది. తొలుత కొన్ని విమానాలు లీజ్కు తీసుకుని, తదుపరి కొనుగోలు చేయాలనే అంశాన్నీ టాటా సన్స్ పరిశీలిస్తున్నట్లు సమాచారం.