న్యూఢిల్లీ, డిసెంబర్ 12: జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ..దేశీయ మార్కెట్లో మరింత పట్టు సాధించడానికి ప్రణాళికలు రచిస్తున్నది. దేశవ్యాప్తంగా లగ్జరీ కార్లకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ఒకేసారి 8 సరికొత్త మోడళ్ళను పరిచయం చేసింది. వచ్చే రెండు నెలల్లో అందుబాటులోకి రానున్న ఈ మోడళ్ళను బీఎండబ్ల్యూ ఇండియా గ్రూపు ప్రెసిడెంట్ విక్రమ్ పవాహ్ పరిచయం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దేశీయంగా లగ్జరీ కార్ల విక్రయాలు టాప్ గేర్లో దూసుకుపోతున్నాయని, కరోనాతో రెండేం డ్లు పడిపోయి విక్రయాలు తిరిగి పుంజుకున్నాయన్నారు. 2022 కంపెనీ చరిత్రలో నిలిచిపోయే ఏడాదని, విక్రయాలు భారీగా పెరిగాయని, వచ్చే ఏడాది మరింత పెరగగలదని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం మరిన్ని మోడళ్ళను విడుదల చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. వీటిలో ఎలక్ట్రిక్ సెడాన్ ఐ7 కూడా ఉన్నది. ద్రవ్యోల్బణం, వడ్డీరేట్లు పెరుగుతుండటం వంటి సవాళ్లు ఉన్నప్పటికీ వీటిని అధిగమించి వచ్చే ఏడాదిలో ఇంతకంటే ఎక్కువగానే వాహనాలను విక్రయించగలుగుతామన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తంచేశారు.