Coal Blending Power Costly | దిగుమతి చేసుకున్న బొగ్గు, దేశీయ బొగ్గు మిశ్రమంతో విద్యుత్ ఉత్పత్తి వ్యయం 30 శాతం పెరుగుతుందని అఖిల భారత విద్యుత్ ఇంజినీర్ల సమాఖ్య (ఏఐపీఈఎఫ్) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు కేంద్ర విద్యుత్శాఖ మంత్రి ఆర్కే సింగ్కు లేఖ రాసింది. ఇటీవల విద్యుత్ ఉత్పత్తికి సరిపడా బొగ్గు నిల్వల్లేవని.. పరిస్థితులు ఇలాగే కొనసాగితే దేశమంతా అంధకారమయం అవుతుందని వార్తలొచ్చాయి.
ఈ నేపథ్యంలో కోల్ ఆధారిత థర్మల్ విద్యుత్ ఉత్పాదక స్టేషన్లలో అవసరాలకు సరిపడా బొగ్గు నిల్వలను అందుబాటులో ఉంచుకోవాలని విద్యుత్శాఖ సలహా ఇచ్చింది. దేశీయంగా వస్తున్న డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి కోసం 15 శాతం వరకు విదేశీ బొగ్గు, మిగతా దేశీయ బొగ్గు మిశ్రమం ఉపయోగించాలని సూచించింది.
పంజాబ్లో దేశీయ బొగ్గు టన్ను విలువ రూ.5,150 అయితే, విదేశీ బొగ్గు టన్ను విలువ రూ.22 వేలు అని ఏఐపీఈఎఫ్ అధికార ప్రతినిధి వీకే గుప్తా తెలిపారు. దేశీయ బొగ్గుతో 15 శాతం విదేశీ బొగ్గు కలిపి ఉత్పత్తి చేసే విద్యుత్ ఖర్చు రూ.3.22 నుంచి రూ.4.37కు పెరుగుతుందని అంచనా వేశారు.
ఇప్పటికే నగదు కొరత సమస్యను ఎదుర్కొంటున్న డిస్కంలు పెరిగిన ధరలు భరించలేవని ఏఐపీఈఎఫ్ అధికార ప్రతినిధి వీకే గుప్తా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేట్ విద్యుత్ ఉత్పాదక సంస్థలు విద్యుత్ ఉత్పత్తి ఖర్చుపై లెక్కలు తారుమారు చేసి టారిఫ్ పెంచుకుంటాయన్నారు.
ఆదానీ గ్రూప్ దిగుమతి చేసుకున్న బొగ్గు కొనుగోళ్లు.. దాంతో విద్యుత్ ఉత్పత్తి విషయమై సమర్పించిన పత్రాలను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) దర్యాప్తు చేసింది. డీఆర్ఐ దర్యాప్తు విషయమై నిర్ణయాలు సుప్రీంకోర్టు వద్ద పెండింగ్లో ఉన్నాయని వీకే గుప్తా గుర్తు చేశారు.
అంతర్జాతీయ మార్కెట్లో బొగ్గు ధరలు పెరిగిపోయాయని, కనుక బొగ్గు దిగుమతి ఖర్చుతో కూడుకున్నదన్నారు. మూడేండ్లుగా దేశీయంగా బొగ్గు ఉత్పత్తి తగ్గిపోయిందని, కానీ విద్యుత్ కోసం డిమాండ్ ప్రతియేటా పెరుగుతున్నదని ఏఐపీఈఎఫ్ అధికార ప్రతినిధి వీకే గుప్తా చెప్పారు.