న్యూఢిల్లీ: బిట్ కాయిన్.. వర్చువల్ కరెన్సీ అంటే ఇప్పుడు ఇన్వెస్టర్లకు యమ క్రేజీ.. ఫుష్కర కాలం క్రితం పురుడు పోసుకున్న ఈ డిజిటల్ కరెన్సీ.. కరోనా మహమ్మారి పుణ్యమా?! అని ప్రపంచ మార్కెట్లలో చేస్తున్న హల్చల్ అంతా ఇంతా కాదు.. దీనికి ఎలన్మస్క్ వంటి గ్లోబల్ సెలబ్రిటీలు.. వీసా, మాస్టర్ కార్డ్, పే పాల్.. జేపీ మోర్గాన్ వంటి ఇంటర్నేషనల్ ఫైనాన్సియల్ సర్వీసెస్ దిగ్గజాలు దన్నుగా నిలవడంతో సామాన్యుల్లోనూ బిట్ కాయిన్ పట్ల ఆసక్తి పెరుగుతున్నది.
నిత్యం ఒడిదొడుకులనెదుర్కొంటూ సాగే మార్కెట్ ట్రేడింగ్లో 58వేల డాలర్లు తాకిన బిట్ కాయిన్కు అగ్రరాజ్యం.. అమెరికాలో అలస్కా మినహా అన్ని రాష్ట్రాల్లో సొంతంగా ఏటీఎం కేంద్రాలు ఏర్పాటవుతున్నాయి. న్యూయార్క్ సిటీ శివారుల్లోని గ్యాస్ స్టేషన్ల వద్ద వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఇన్వెస్టర్లు.. కస్టమర్లు బిట్ కాయిన్లను కొనుగోలు/ విక్రయించడం లేదా హార్డ్ క్యాష్ తీసుకోవచ్చు. కాయిన్ ఫ్లిప్, కాయిన్ క్లౌడ్ వంటి కియోస్క్ ఆపరేట్లు అమెరికా అంతటా వేల ఏటీఎం కేంద్రాలు ఏర్పాటు చేశాయి.
క్వాడ్ కాయిన్ ఫౌడర్ మార్క్ షొయికెట్ మాట్లాడుతూ ప్రతిచోటా బిట్ కాయిన్ ఏటీఎంలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారన్నారు. 406 గ్లాస్ అనే స్టోర్ వద్ద ఏడు కేంద్రాలను ఏటీఎంలు ఏర్పాటు చేయడానికి గుర్తించామన్నారు. గత జనవరి నాటికి అమెరికాలో 28,185 ఏటీఎంలు ఉండగా, గత ఐదు నెలల్లోనే సుమారు 10వేల కేంద్రాలు ఏర్పాటయ్యాయి.
లాస్వేగాస్ కేంద్రంగా పని చేస్తున్న కాయిన్ క్లౌడ్.. అమెరికాలో 1470 ఏటీఎం మిషన్లు కలిగి ఉంది. ఈ ఏడాది చివరికల్లా 10 వేల ఏటీఎం మిషన్లు ఏర్పాటు చేస్తామని కాయిన్ క్లౌడ్ సీఈవో చిరిస్ మైక్ అలారీ చెప్పారు. అట్లాంటా బేస్గా పని చేస్తున్న బిట్ కాయిన్ డిపో గత ఏడాది కాలంలో 500 నుంచి 1800కి పైగా ఏటీఎం మిషన్లను ఏర్పాటు చేసింది. 25-40 ఏండ్ల మధ్య వయస్కులైన కస్టమర్లు ఆన్లైన్లో బిట్ కాయిన్ ఏటీఎం కేంద్రాల కోసం వెతుకుతున్నారు.