శామీర్పేట, డిసెంబర్ 17: ఐసీఎంఆర్-ఎన్ఏఆర్ఎఫ్బీఆర్ సంయుక్తంగా జీనోమ్ వ్యాలీలో ఏర్పాటు చేసిన బయోమెడికల్ పరిశోధన కేంద్రాన్ని రాష్ట్ర కార్మిక మంత్రి మల్లారెడ్డితో కలిసి కేంద్ర ఆరోగ్య, ఎరువుల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ శనివారం ప్రారంభించారు. 100 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ పరిశోధన కేంద్రం దేశంలో అతిపెద్దది కావడం విశేషం. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మానవీయ, నైతిక జంతు సంరక్షణ కోసం అత్యాధునిక అంతర్జాతీయ ప్రమాణాలకు కట్టుబడి ఉండటంతో భారత్కు అంతర్జాతీయంగా గుర్తింపు లభించిందన్నారు.
ఐసీఎంఆర్-ఎన్ఏఆర్ఎఫ్బీఆర్ అనే ప్రయోగశాల జంతుశాస్ర్తాల కోసం అంకితమైన సంస్థని, దేశంలో ప్రాథమిక, అనువర్తిత, నియంత్రణ జంతు పరిశోధన కోసం ప్రత్యేకంగా కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రయోగశాల జంతువుల నైతిక సంరక్షణ, ఉపయోగం, సంక్షేమాన్ని ప్రోత్సహించడానికి ఉత్తమ సమకాలీన పద్దతులను అందించడానికి ప్రయత్నిస్తుందన్నారు. బయోఫార్మా, బయో మెడిసిన్, బయో టెక్నాలజీలో అత్యుత్తమ కేంద్రాన్ని సృష్టించడం, నైతిక సంరక్షణ, జంతువుల వినియోగంపై అంతర్జాతీయ సహకారాన్ని ప్రోత్సహించే దిశగా ఇదొక ముందడుగు అని ఆయన వ్యాఖ్యానించారు.