Bima Sugam | బీమా రంగంలో సమూల మార్పులు రాబోతున్నాయి. ప్రజల సౌకర్యార్థం బీమా సుగమ్ అనే పేరుతో ఆన్లైన్ ప్లాట్ఫామ్ను ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) అభివృద్ది చేస్తున్నది. ఈ ప్లాట్ఫామ్తో దేశవ్యాప్తంగా బీమా రంగ సేవలు విస్తరిస్తాయని తెలిపింది. అలాగే, కస్టమర్లకు నిరంతరాయంగా సేవలు లభిస్తాయని వివరించింది. తత్ఫలితంగా భారత బీమా రంగ స్వరూపమే సమూలంగా మారబోతున్నదని ఐఆర్డీఏఐ చైర్మన్ దేవాశీష్ పాండా చెప్పారు.
డిజిటల్ ట్రాన్సాక్షన్స్లో యూపీఐ పేమెంట్ మాదిరిగానే ఇన్సూరెన్స్ రంగంలో బీమా సుగమ్ సరికొత్త అధ్యాయానికి నాంది ప్రస్తావన కానున్నదని ఐఆర్డీఏఐ చైర్మన్ దేవాశీష్ పాండా తెలిపారు. 2016లో మొదలైన యూపీఐ పేమెంట్స్ అనతి కాలంలోనే ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. గత సెప్టెంబర్లో యూపీఐ చెల్లింపులు రూ.11లక్షల కోట్లకు చేరాయి. యూపీఐ పేమెంట్స్ తరహాలోనే బీమా సుగమ్ కూడా సక్సెస్ అవుతుందన్నారు.
బీమా పాలసీల విక్రయాలతోపాటు ఇతర సేవలకు బీమా సుగమ్ వేదికగా నిలుస్తుందని దేవాశీష్ పాండా చెప్పారు. ఈ ప్లాట్ఫామ్ ద్వారానే క్లయిమ్ సెటిల్మెంట్లు జరుగుతాయన్నారు. ఏజంట్లు, వెబ్ అగ్రిగేటర్లు, ఇన్సూరెన్స్ మీడియేటర్లకు బీమా సుగమ్ అందుబాటులో ఉంటుందని చెప్పారు. పాలసీదారులు నేరుగా దీని సేవలు పొందొచ్చునని తెలిపారు.