న్యూయార్క్ : ప్రపంచంలో ముందెన్నడూ లేనివిధంగా ప్రజలు మెరుగైన జీవితాన్ని ఆస్వాదిస్తున్నా నిత్యం ఎందుకు విచారంగా అసమ్మతితో రగిలిపోతుంటారో అర్ధం కావడం లేదని బిలియనీర్ ఇన్వెస్టర్, సహచర బిలియనీర్ వారెన్ బఫెట్ స్నేహితుడు చార్లీ ముంగర్ విస్మయం వ్యక్తం చేశారు. నేటి తరం కంటే వెనుకటి తరాల వారు చరిత్ర అంతటా అత్యంత సంక్లిష్ట పరిస్ధితులను ఎదుర్కొన్నారని 98 ఏండ్ల బిలియనీర్ పేర్కొన్నారు.
ఇబ్బందులు, సమస్యలు వెంటాడుతున్న సందర్భాల్లో ప్రజలు తమ దుస్ధితిపై బాధపడుతుంటారని ఆయన చెప్పుకొచ్చారు. తాను డైరెక్టర్గా ఉన్న న్యూస్పేపర్ కంపెనీ డైలీ జర్నల్ వార్షిక భేటీలో ముంగర్ ఈ వ్యాఖ్యలు చేశారు. 1930 ప్రాంతాల్లో అమెరికన్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు.
ఆధునిక జీవితంలో అసూయతో ప్రజలు పరుగులు తీస్తున్నారని, 1800 ఆరంభంలో జీవితం దుర్భరంగా ఉండేదని ప్రజలు తక్కువకాలం జీవించేవారని, అప్పట్లో ప్రింటింగ్ ప్రెస్, ఎయిర్ కండిషన్లు లేవని, కనీసం ఆధునిక వైద్యం అందుబాటులో లేదని అన్నారు. గత శతాబ్ధకాలంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయని, దీర్ఘాయువు సొంతం కావడంతో పాటు పేదరికం తగ్గుముఖం పట్టిందన్న హార్వర్డ్ సైకాలజిస్ట్ స్టీవెన్ పింకర్ వ్యాఖ్యలను లెజెండరీ ఇన్వెస్టర్ చార్లీ ముంగర్ ప్రస్తావించారు. ప్రజలు ఫిర్యాదు చేసే ధోరణిని మానుకుంటే మేలని ఆయన హితవు పలికారు.