ముంబై, డిసెంబర్ 15: వరుస ర్యాలీలతో అదరగొడుతున్న భారత్ ప్రధాన స్టాక్ మార్కెట్ శుక్రవారం రికార్డులతో హోరెత్తించింది. రెండు ప్రధాన సూచీలతో పాటు పలు హెవీవెయిట్ షేర్లు చరిత్రాత్మక రికార్డుస్థాయిలకు చేరాయి. మార్కెట్ సంపదలోనూ కొత్త రికార్డు నెలకొంది. విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో శుక్రవారం సెన్సెక్స్ ఇంట్రాడేలో 71,605 నూతన రికార్డుస్థాయికి చేరింది. చివరకు 969 పాయింట్లు లాభపడి 71,484 పాయింట్ల వద్ద ముగిసింది. మరో ప్రధాన సూచి ఎన్ఎస్ఈ నిఫ్టీ ఇంట్రాడేలో కీలకమైన 21,500 స్థాయిని సమీపించిన అనంతరం 274 పాయింట్ల భారీలాభంతో 21,457 పాయింట్ల వద్ద నిలిచింది. వివిధ రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ఆర్థిక సంస్కరణలు కొనసాగుతాయన్న అంచనాలు, వడ్డీ రేట్ల తగ్గుదలకు అమెరికా ఫెడ్ సంకేతాలివ్వడం, యూఎస్ బాండ్ ఈల్డ్స్, క్రూడ్ ధరలు తగ్గడంతో ఎఫ్పీఐల పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని, ఈ నేపథ్యంలో మార్కెట్ అలుపెరుగని ర్యాలీ సాగిస్తున్నదని మెహతా ఈక్విటీస్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ తాప్సే చెప్పారు. మార్కెట్లో బుల్స్ ఆధిపత్యం చెలాయిస్తున్నారని, దీంతో వరుసగా ఏడోవారమూ ఇండెక్స్లు లాభాల్లో ముగిసాయని ఎల్కేపీ సెక్యూరిటీస్ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ రూపక్ డే తెలిపారు. యూఎస్లో సాఫ్ట్వేర్ సర్వీసులకు డిమాండ్ పెరుగుతుందన్న అంచనాలతో ఐటీ ఇండెక్స్ పరుగులు తీసిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు.
ఐటీ స్టాక్స్, ఎస్బీఐ ఆల్టైం హై..
మార్కెట్ల ర్యాలీకి ఐటీ షేర్లు, ఎస్బీఐలు నేతృత్వం వహించాయి. సెన్సెక్స్ షేర్లలో అన్నింటికంటే అధికంగా 5.58 శాతం పెరిగిన హెచ్సీఎల్ టెక్ ఆల్టైం రికార్డుస్థాయి రూ.1,490 వద్ద ముగిసింది. టీసీఎస్ సైతం 5.6 శాతం మేర పెరిగి కొత్త గరిష్ఠస్థాయి రూ.3,870 వద్దకు చేరింది. బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైతం ఇదేబాటలో 3.95 శాతం జంప్చేసి రికార్డుస్థాయి రూ.648 వద్ద నిలిచింది. కొత్త రికార్డులు సృష్టించిన షేర్లలో లార్సన్ అండ్ టుబ్రో, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎన్టీపీసీలు ఉన్నాయి. వివిధ రంగాల సూచీల్లో ఐటీ ఇండెక్స్ 4.41 శాతం, టెక్నాలజీ ఇండెక్స్ 3.64 శాతం చొప్పున ర్యాలీ జరిపాయి. మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, కమోడిటీ సూచీలు 1.78 శాతం, 1.43 శాతం, 1.38 శాతం చొప్పున పెరిగాయి. యుటిలిటీస్, ఆటో సూచీలు 0.67 శాతం, 0.48 శాతం చొప్పున పెరిగాయి. ఎఫ్ఎంసీజీ, ఆటో, రియల్టీ, సర్వీసుల సూచీలు తగ్గాయి.
3 రోజుల్లో రూ.8 లక్షల కోట్లు
మూడు రోజులపాటు జరుగుతున్న వరుస ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపద రూ.8 లక్షల కోట్లు పెరిగింది. బీఎస్ఈలో లిస్టయిన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ రూ.8,11, 802 కోట్లు పెరిగి రూ. 3,57,87,999 కోట్లకు చేరింది.
ఎఫ్పీఐల దన్నుతో ఒక్క రోజులోనే బిలియన్ డాలర్లు
శుక్రవారం దూకుడుగా జరిగిన ర్యాలీకి ప్రధాన కారణం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్పీఐలు) భారీ పెట్టుబడులే కారణం. ఈ రోజున వారు రూ.9,239 కోట్లు (1.11 బిలియన్ డాలర్లు) స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసినట్టు స్టాక్ ఎక్సేంజీల తాజా గణాంకాలు వెల్లడస్తున్నాయి. ఇదే సమయంలో దేశీయ ఫండ్స్ రూ.3,077 కోట్లు మార్కెట్ నుంచి వెనక్కు తీసుకున్నాయి. డిసెంబర్నెలలో ఇప్పటివరకూ ఎఫ్పీఐలు ఒక్కో ట్రేడింగ్ రోజుకు సగటున రూ.4,000 చొప్పున ఈక్విటీల్లో పెట్టుబడి చేశారు.