న్యూయార్క్ : టార్గెట్స్, డెడ్లైన్స్, పనిఒత్తిళ్లతో సతమతమయ్యే ఉద్యోగులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రాకతో స్వాంతన లభించనుంది. సుదీర్ఘ వారాంతాలతో కుటుంబసభ్యులు, స్నేహితులు, బంధు మిత్రులతో ఉల్లాసంగా గడుపుతూ ఒత్తిడిని చిత్తు చేసి మెరుగైన ఆరోగ్యం సొంతం చేసుకునే వెసులుబాటు కలగనుంది. ఏఐ రాకతో మన జీవన విధానం, పని పద్ధతులు, ఉద్యోగాల తీరుతెన్నులు సమూలంగా మారతాయని టెక్ దిగ్గజం బిల్ గేట్స్ (Bill Gates) తన ఆలోచనలను పంచుకున్నారు.
వాట్ నౌ పాడ్కాస్ట్లో ఇటీవల గేట్స్ మాట్లాడుతూ భవిష్యత్లో మెషీన్స్ ఎన్నో సంక్లిష్ట పనులను చక్కబెడతాయని ఇది వారానికి మూడు రోజుల పనికి దారితీస్తుందని, అందరూ రిలాక్స్ అవుతూ పనిచేసుకునే వెసులుబాటు కలుగుతుందని అంచనా వేశారు. వారానికి మీరు మూడు రోజులు మాత్రమే పనిచేసే సమాజం అందుబాటులోకి వస్తుందని చెప్పారు. టెక్నాలజీతో సానుకూల మార్పులు చోటుచేసుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఏఐ వాడే క్రమంలో ఆయా వ్యక్తులు అప్రమత్తంగా, నైతికతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఇటీవల ఓ బ్లాగ్పోస్ట్లో గేట్స్ పేర్కొన్నారు.
ఇక జేపీ మోర్గాన్ సీఈవో జేమీ డైమన్ కూడా ఏఐతో వారానికి తక్కువ రోజులు పనిచేసే విధానం అందుబాటులోకి వస్తుందని అన్నారు. రాబోయే తరం ఉద్యోగులు ఏఐ రాకతో వారానికి కేవలం మూడున్నర రోజులు మాత్రమే పనిచేసే వెసులుబాటు ఉంటుందని చెప్పారు. నూతన టెక్నాలజీ మనుషులు దీర్ఘకాలం, ఆరోగ్యంగా ఉండేలా దోహదపడుతుందని పేర్కొన్నారు.
Read More :