Gold Reserve in Bihar | బీహార్లోని జముయి జిల్లా దేశంలోనే అతిపెద్ద బంగారం నిల్వల ( Reserve ) కు కేంద్రంగా నిలుస్తున్నది. ఈ జిల్లా పరిధిలో బంగారం నిల్వల తవ్వకానికి అనుమతులు ఇవ్వాలని బీహార్ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఈ సంగతి రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) సర్వే ప్రకారం జముయి జిల్లాలోని గోల్డ్ రిజర్వులో 222.88 మిలియన్ టన్నుల బంగారం, 37.6 టన్నుల ఖనిజాలు ఉన్నాయని తెలుస్తున్నది. జీఎస్ఐతోపాటు జాతీయ ఖనిజాల అభివృద్ధి సంస్థ (ఎన్ఎండీసీ)తోపాటు పలు సంస్థలతో ఈ బంగారం రిజర్వులో తవ్వకాలు చేపట్టాలని రాష్ట్ర గనులు, జియాలజీ విభాగాలు సంప్రదింపులు జరుపుతున్నాయి.
జముయి జిల్లాలోని కర్మాటియా, ఝాఝా, సోనో ప్రాంతాల్లో బంగారం నిల్వలు ఉన్నాయని జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) సర్వే నివేదిక వచ్చింది. ఈ నివేదిక ఆధారంగానే వివిధ సంస్థలతో సంప్రదింపులు చేపట్టామని అదనపు చీఫ్ సెక్రటరీ, గనులశాఖ కమిషనర్ హర్జోత్ కౌర్ బమ్హ్రా తెలిపారు. ప్రాథమిక దశలో తవ్వకాలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థలతో నెల రోజుల్లో ఎంవోయూ కుదుర్చుకోనున్నట్లు తెలిపారు.
గతేడాది లోక్సభలో అప్పటి గనులశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ దేశంలోకెల్లా బీహార్లో అత్యధిక బంగారం రిజర్వు నిల్వలు ఉన్నాయని తెలిపారు. బీహార్లో 222.885 మిలియన్ టన్నులబంగారం లభిస్తుందన్నారు. ఇది దేశంలోని బంగారం రిజర్వుల్లో 44 శాతం అని చెప్పారు. 2015 ఏప్రిల్ ఒకటో తేదీన నిర్ధారించిన అంచనా ప్రకారం దేశవ్యాప్తంగా 654.74 టన్నుల బంగారంతోపాటు 501.83 మిలియన్ టన్నుల ప్రైమరీ గోల్డ్ ఓర్ నిల్వలు ఉన్నాయని ప్రహ్లాద్ జోషి చెప్పారు. బీహార్లో 37.6 టన్నుల బంగారంతోపాటు 222.885 మిలియన్ టన్నుల/ (44 శాతం) గోల్డ్ ఓర్ ఉందన్నారు.