Vedanta on BPCL కేంద్ర ప్రభుత్వ ముడి చమురు సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) టేకోవర్కు వేదంతా గ్రూప్ రూ.80 వేల కోట్లకు బిడ్ దాఖలు చేయనున్నట్లు సంకేతాలిచ్చింది. సరైన ధరకే బీపీసీఎల్ను కొనుగోలు చేస్తామని బ్లూంబర్గ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వేదంతా చైర్మన్ అనిల్ అగర్వాల్ తెలిపారు. మొత్తం వాటాను తామే కొనుగోలు చేస్తామని కూడా చెప్పారు. గతేడాది సెప్టెంబర్లో బీపీసీఎల్ స్క్రిప్ట్ రూ.503 ఉంటే, ఇప్పుడు దాని విలువ రూ.397 పలుకుతున్నదన్నారు. దీని ప్రకారం సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.85,522 కోట్లు ఉంటుంది. దీని ప్రకారం రూ.90వేల కోట్లకు బిడ్ దాఖలు చేయొచ్చునని పేర్కొన్నారు.
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ను చాలా కాలంగా ప్రైవేట్ సంస్థలకు విక్రయించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇప్పటికిప్పుడు అంత భారీ మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం సరి కాదని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. నిరంతరం లాభాలు గడిస్తున్న సంస్థ ఇది. దీని విక్రయం పూర్తయితే ప్రభుత్వానికి అతిపెద్ద పెట్టుబడుల ఉపసంహరణగా నిలుస్తుంది. గత సెప్టెంబర్లోనే బీపీసీఎల్లో పెట్టుబడుల ఉపసంహరణకు అవసరమైన బిడ్ దాఖలుకు గడువును నిర్దేశించింది.
బీపీసీఎల్లో ప్రభుత్వ వాటా 52.98 శాతం. పబ్లిక్ వాటా 46.71 శాతం. దేశంలోనే రెండో అతిపెద్ద రిఫైనరీ సంస్థ గల సంస్థ బీపీసీఎల్. మార్చి నాటికి ప్రభుత్వం మరో దఫా టెండర్లను పిలుస్తుందని అనిల్ అగర్వాల్ ఆశాభావంతో ఉన్నారు. అనిల్ అగర్వాల్ సారధ్యంలోని వేదంతా గ్రూప్తోపాటు మరో రెండు సంస్థలు కూడా పోటీలో ఉన్నాయి. సంబంధిత సంస్థలతో అవగాహనకు వస్తామని కూడా ఆయన చెప్పారు. 2020 నవంబర్లోనూ వేదంతా గ్రూప్.. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ (ఈవోఐ) దాఖలు చేసినా వర్కవుట్ కాలేదు.
బీపీసీఎల్లో వాటాల విక్రయం పూర్తయితే కొనుగోలు చేసిన సంస్థకు మొత్తం యాజమాన్యాన్ని కేంద్రం బదిలీ చేస్తారు. గతంలోనూ బిడ్ దాఖలు తేదీ నిర్ణయించినా గడువు పొడిగిస్తూ వచ్చారు. ఇప్పటి వరకు నాలుగు సార్లు పొడిగించింది కేంద్రం. దేశంలో బీపీసీఎల్కు 15,177 పెట్రోల్ పంపులు, 6,011 ఎల్పీజీ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు, 51 ఎల్పీజీ బాట్లింగ్ ప్లాంట్లు ఉన్నాయి.