న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: ఐడీబీఐ బ్యాంక్ను విక్రయించేందుకు బిడ్స్ను ఆహ్వానించనున్నట్టు దీపం కార్యదర్శి తుహిన్కాంత్ పాండే చెప్పారు. ఈ బ్యాంక్ ప్రైవేటీకరణకు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్ (ఈవోఐ)పై డిజిన్వెస్ట్మెంట్ శాఖ కసరత్తు చేస్తున్నదని, త్వరలో ఇన్వెస్టర్ల నుంచి ప్రాధమిక బిడ్స్ను పిలుస్తామన్నారు. ఐడీబీఐ బ్యాంక్లో వాటా విక్రయం, యాజమాన్య నియంత్రణ బదిలీకి 2021 మే నెలలో కేంద్ర క్యాబినెట్ సూత్రప్రాయ ఆమోదాన్ని తెలిపింది. బ్యాంక్లో కేంద్ర ప్రభుత్వానికి 45.48 శాతం వాటా ఉంది. ఈ బ్యాంక్కు ప్రస్తుత ప్రమోటర్గా వ్యవహరిస్తున్న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)కు 49.24 శాతం వాటా ఉంది. ప్రభుత్వం, ఎల్ఐసీలకు కలిసి 94 శాతం వాటా ఉందని, ఇందులో ఎంత వాటాను విక్రయిస్తామన్నది ఈవోఐలో తెలియపర్చనున్నట్టు పాండే తెలిపారు. బుధవారం ఆయన ఫిక్కీ సదస్సులో మాట్లాడుతూ ఇప్పుడు బ్యాంక్ పనితీరు బాగా మెరుగుపడిందని, ఇన్వెస్టర్ల నుంచి ఆసక్తి వ్యక్తమవుతున్నదన్నారు.
పీఎస్యూలను కొనండి
ప్రైవేటుపరం చేసేందుకు సిద్దం చేసిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో (సీపీఎస్ఈలు) పెట్టుబడి అవకాశాల్ని అన్వేషించాలంటూ దీపం కార్యదర్శి ప్రైవేటు రంగాన్ని కోరారు. కార్పొరేట్ గవర్నెన్స్ ప్రక్రియల కారణంగా సీపీఎస్ఈల పనితీరు మెరుగుపడిందని, ఇన్వెస్టర్లకు వాటి షేర్లు స్టాక్ సూచీలతో పోలిస్తే మంచి రాబడుల్ని ఇస్తున్నాయన్నాయన్నారు. ప్రైవేటు కంపెనీలు వాటి ఉత్పత్తి పెంపునకు, ఉపాధి కల్పనకు ఇప్పటికే నడుస్తున్న సీపీఎస్ఈల్లో పెట్టుబడి అవకాశాలున్నాయన్నారు. బీఈఎంఎల్, షిప్పింగ్ కార్పొరేషన్, కాంకర్, వైజాగ్ స్టీల్, ఐడీబీఐ బ్యాంక్, ఎన్ఎండీసీకి చెందిన నగర్నార్ స్టీల్ ప్లాంట్, హెచ్ఎల్ఎల్ లైఫ్కేర్లను ప్రైవేటుపరం చేసేందుకు డిజిన్వెస్ట్మెంట్ శాఖ సిద్ధం చేసిన సంగతి తెలిసిందే.
ఎల్ఐసీ లాభాల మెరుగుకు చర్యలు
ఈ సంవత్సరం కేంద్రం మైనారిటీ వాటా విక్రయించిన తర్వాత మార్కెట్లో లిస్టయిన ఎల్ఐసీ ఆదాయం, లాభాల్ని మెరుగుపర్చుకోవడానికి పలు చర్యల్ని తీసుకుంటున్నదని పాండే వెల్లడించారు. ప్రైవేటు బీమా సంస్థలకంటే కాస్త వెనుకబడి ఉన్న విభాగాల్లో మెరుగుపర్చే ప్రక్రియను ఎల్ఐసీ చేపట్టిందన్నారు. ఇన్వెస్ట్మెంట్ రిలేషన్ వంటి విభాగాల్లో కొత్తగా వృత్తినిపుణులను, చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ను నియమిస్తున్నదని తెలిపారు.